• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల

నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)లో చేరినవారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. అన్ని నియామకాల్లోనూ కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్తుంది. అలాగే ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్‌ ఏటా విడుదల చేస్తోంది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు లెఫ్టినెంట్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు వీరికి దక్కుతాయి. ఇటీవల వెలువడిన ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ప్రకటనకు సంబంధించిన వివరాలు...


ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో మౌఖిక పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులైనవారే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులోనూ మెరిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 


ఎంపికైతే...


ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఈ ఏడాది అక్టోబరు నుంచి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్‌ కమిషన్‌) కిందికి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు వైదొలగాలి. లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలూ పొందవచ్చు. 

పోస్టు: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ


మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి. 


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొందాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు.


వయసు: జులై 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1998 - జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.   


వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Posted Date : 27-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌