• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీతో ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీ

* 450 అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌



భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 450 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.48 వేల వేతనం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.


వారానికి ఐదు పని దినాలు, తక్కువ పనివేళలు, ఒత్తిడి లేని విధులు ఆర్‌బీఐ ప్రత్యేకత. అసిస్టెంట్లుగా చేరినవారు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తారు. వీరు మూడేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రేడ్‌ ఎ, అనంతరం గ్రేడ్‌ బి స్థాయిని అందుకోవచ్చు. అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ దశను దాటిన వారు భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రధాన పరీక్ష స్కోరుతో మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అసిస్టెంట్‌గా చేరిన వారికి రూ.20,700 మూలవేతనం చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.47,849 వేతనం పొందవచ్చు. దీనికి హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తుంది. హైదరాబాద్‌ లాంటిచోట్ల విధులు నిర్వర్తించినవారికి ఆర్‌బీఐ వసతి గృహాల్లో అవకాశం లభించకపోతే ప్రారంభం నుంచే సుమారు రూ.పది వేల హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. 


ప్రాథమిక పరీక్ష 

దీన్ని వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30, న్యూమరికల్‌ ఎబిలిటీ 35, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు పది మందిని చొప్పున ప్రధాన పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. 


ప్రధాన పరీక్ష 

200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున.. రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. విభాగాలవారీ కేటాయించిన సమయాల్లో వీటిని పూర్తిచేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 నిమిషాల వ్యవధి ఉంది. మిగిలిన ఒక్కో విభాగాన్నీ 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. ఇందులో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం విభాగాల వారీ ఒక్కో పోస్టుకు ఇద్దరిని చొప్పున లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు. 

ప్రాథమిక, ప్రధాన.. రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. రెండు పరీక్షల్లోనూ విభాగాలవారీ అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. 


లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ 

మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 14 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 101 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి పోటీ పడటానికి మారాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి. హిందీ భాష వచ్చినవారు చండీగఢ్‌ 21/ కాన్పూర్‌ అండ్‌ లఖ్‌నవూ 55/ నాగ్‌పూర్‌ 19/ న్యూదిల్లీ 28 ఖాళీల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపికచేసుకుని పోటీ పడవచ్చు. బెంగళూరులో 58 ఖాళీలకు కన్నడ వచ్చిన వారికి అవకాశం దక్కుతుంది. 


సన్నద్ధత

ఇప్పటి నుంచి ప్రిలిమినరీకి సరిగా 37 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ వ్యవధిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకున్నవారే విజయం సాధించగలరు. అయితే ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆర్‌బీఐ కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కానవసరం లేదు. రెండు పరీక్షలూ ఒకే తరహాలో ఉండటమే దీనికి కారణం. 

కొత్తగా సన్నద్ధమయ్యేవారు మొదటి 20 రోజులు ప్రాథమికాంశాలు చదివి, విభాగాల వారీ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. చివరి 15 రోజులు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. 

ప్రతి విభాగాన్నీ నిర్ణీత సమయంలోనే పూర్తిచేయాలి. అలాగే అన్ని విభాగాల్లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. కాబట్టి అన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. 

 రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే మార్గం. 

 ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ ఈ మూడు అంశాలూ ప్రాథమిక, ప్రధాన పరీక్ష రెండింటిలోనూ ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది. జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాలను ప్రాథమిక పరీక్ష అనంతరం చదువుకోవాలి. 

 న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు సులువుగా ఉన్నప్పటికీ సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందువల్ల తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలపైనే ముందు దృష్టి పెట్టాలి. సమయం మిగిలితేనే మిగిలినవి ప్రయత్నించాలి. 

 కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణింతాలపై పట్టు సాధించాలి. అంకెలు, సూక్ష్మీకరణలపై ప్రావీణ్యం పొందితే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. 

 రుణాత్మక మార్కులు ఉన్న కారణంగా తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలు చేస్తుంది. 

 పరీక్షకు పదిహేను రోజుల ముందు నుంచి కనీసం రోజుకొక మాక్‌ టెస్టు రాయాలి. సమయానికీ ప్రాధాన్యమివ్వాలి. ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి. వెనుకబడిన విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, తప్పులు పునరావృతం కావు. 


ముఖ్య సమాచారం 

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు.

వయసు: సెప్టెంబరు 1, 2023 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబరు 2, 1995 - సెప్టెంబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 4

దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,  ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ.50. మిగిలిన అందరికీ రూ.450. (జీఎస్‌టీ అదనం)

ప్రిలిమినరీ పరీక్షలు: అక్టోబరు 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు.

మెయిన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 2 

ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈఎస్‌ఈలో విజయానికి మెలకువలు

‣ అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే త‌యారు చేశారు!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

‣ పీఓ కొలువుల ప్రిపరేషన్‌ ప్లాన్‌

‣ లెఫ్టినెంట్‌ హోదాలో మహిళామణులు

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌