‣ టెన్త్ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం
ఆఫీసు అంటే అన్ని రకాల సిబ్బంది ఉంటారు. ఎవరి పాత్ర మేరకు వాళ్లు ప్రధానమే. అర్హతలను బట్టి ఉద్యోగ స్థాయి మారుతుంది అంతే. కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. విజయం సాధిస్తే చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా సాగడానికి సాయపడే గ్రూప్-సీ ఉద్యోగులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లలో అందించడం, ఫైల్స్ భద్రపరచడం, లేఖలు తదితర కమ్యూనికేషన్ను సంబంధితులకు చేరవేయడం, పోస్టల్ వర్క్.. ఇలా పలు రకాల విధులను నిర్వహిస్తూ పై అధికారులకు సాయపడుతుంటారు. అందుకే వీరిని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని వ్యవహరిస్తారు.
విద్యార్హతలు: పదోతరగతి తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ. ఇరవై వేలకు పైగా జీతం అందుతుంది. వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి.
రెండు దశల్లో ఎంపిక
అభ్యర్థుల ఎంపిక కోసం రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ రాత పరీక్షలో ఒక పేపర్ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలను 25 మార్కులకు ఇస్తారు. ఇంతకు ముందు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ ఒక్కోటి 50 మార్కులకు ఉండేవి. ఇప్పుడు 25కి తగ్గించి అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు.
పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి నాలుగో వంతు (0.25) నెగెటివ్ మార్కు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్లోని ప్రశ్నలు మినహా మిగిలినవన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పేపర్-1లో నిర్ణీత అర్హత మార్కులు పొందితేనే రెండో దశలో డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పేపర్-2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులను అనుమతిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్-1లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పేపర్-1లో నాలుగు విభాగాలు
1) జనరల్ ఇంగ్లిష్
2) జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్
3) న్యూమరికల్ ఆప్టిట్యూడ్
4) జనరల్ అవేర్నెస్