కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. విజయం సాధిస్తే చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు.
1. నిపుణుల సలహాలతో ప్రామాణిక స్టడీమెటీరియల్ సేకరించుకోవాలి. కనిపించిన ప్రతి సమాచారాన్ని చదువుతూ కూర్చుంటే సమయం వృథా అవుతుంది.
2. సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సిలబస్ ప్రకారం అన్ని చాప్టర్ల అధ్యయం, రివిజన్, ఆన్లైన్ పరీక్షల ప్రాక్టీస్కు తగిన సమయాన్ని విభజించి, కేటాయించుకోవాలి.
3. అన్ని విభాగాలకు సమప్రాధాన్యం ఉంది కాబట్టి అన్నింటినీ తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇష్టంగా ఉన్నాయని కొన్నింటినే చదవడం, ఇబ్బందిగా అనిపిస్తున్నాయని ఇంకొన్నింటిపై దృష్టిపెట్టకపోడం చేస్తే మార్కులు నష్టపోవాల్సి ఉంటుంది.
4. జనరల్ అవేర్నెస్ కోసం ఆంగ్ల దినపత్రికలను చదవడం మంచిది. వాటి నుంచి పాయింట్స్ నోట్ చేసుకుంటున్నప్పుడే ఆంగ్ల పదాలపై దృష్టి పెట్టి అర్థాలను, వినియోగాన్ని తెలుసుకోవాలి. దీని వల్ల జనరల్ ఇంగ్లిష్ ప్రిపరేషన్ కూడా అవుతుంది.
5. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి వీలైనన్ని సంక్షిప్త పద్ధతులను (షార్ట్కట్స్) నేర్చుకోవాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. గణిత సూత్రాలను తరచూ మననం చేసుకోవాలి.
6. గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని గ్రహించాలి. అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి.
7. ఆన్లైన్ పరీక్షలను, మోడల్ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో గమనించి ప్రిపరేషన్లో మార్పులు చేసుకోవాలి.
8. టైర్-2 పరీక్షకు ముందు నుంచే సిద్ధం కావాలి. టైర్-1 పూర్తయిన తర్వాత ప్రిపేర్ అవడానికి సమయం సరిపోదు. డిస్క్రిప్టివ్ కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. తెలిసిందే కదా పరీక్షలో రాసేద్దాం అని నిర్లక్ష్యం చేస్తే తడబడే అవకాశం ఉంది.
పేపర్-2 వ్యక్తీకరణ పరీక్ష
అర్హత పరీక్ష అయినప్పటికీ పేపర్-2కి కూడా ముందు నుంచే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో జవాబులు రాయవచ్చు. ఎంచుకున్న భాషలో అభ్యర్థుల సాధారణ వ్యక్తీకరణ, రాత నైపుణ్యాలను ఇందులో పరిశీలిస్తారు. 50 మార్కులు కేటాయించారు. 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆ వ్యవధిలో రాయగలిగిన ప్రశ్నలనే అడుగుతారు. అభ్యర్థులు తడబడి సమయాన్ని వృథా చేసుకోకూడదు. ముందు నుంచే రాత ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా సమాధానాలు రాయవచ్చు. ప్రధానంగా ఎస్సే, లెటర్ రైటింగ్పై ప్రశ్నలు ఉంటాయి. ప్రెస్సీ, అప్లికేషన్ రైటింగ్ తదితరాలపై కూడా ప్రిపేర్ కావాలి. అక్షరదోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగంపై శ్రద్ధ వహించాలి. ఆంగ్లంలో జవాబులు రాస్తే క్యాపిటల్, స్మాల్ లెటర్లను ఉపయోగించడంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. పెద్ద పేరాల్లో ఉన్న విషయాన్ని కుదించి సొంత వాక్యాల్లో రాయడాన్ని అభ్యసించాలి.
ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి
ముందుగా అన్ని సబ్జెక్టుల బేసిక్స్పై పట్టు సాధించాలి. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ స్కోరింగ్ విభాగాలు. వాటిలో పూర్తిమార్కులు సాధించడంపై దృష్టిపెట్టాలి. మొదట తేలిక ప్రశ్నలను సాధన చేసి మెల్లగా క్లిష్టమైన వాటిని పరిష్కరించాలి. ఎక్కువ మోడల్ పేపర్లు కూడా చేయాలి. ఎంటీఎస్ పేపర్లతోపాటు ఎస్ఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షల పేపర్లను పరిశీలించాలి. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రశ్నలు చేయడం మంచిది. పేపర్ల ప్రాక్టీస్లో పరీక్ష సమయం కంటే కొద్దిగా తక్కువ టైమ్ పెట్టుకొని చేయాలి. అప్పుడు స్పీడ్ పెరుగుతుంది. జనరల్ అవేర్నెస్కు గ్రూప్ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. పేపర్-2 కోసం ముందు నుంచే ప్రిపేర్ కావాలి. హిందూ పేపర్ చదవడం వల్ల జనరల్ అవేర్నెస్తోపాటు ఇంగ్లిష్పై కొంత అవగాహన పెరుగుతుంది. ఇది డిస్క్రిప్టివ్ పరీక్షకు ఉపయోగకరం.