కౌన్సెలింగ్ ఫిబ్రవరి 15కు వాయిదా
గతంలో అనుమతులు రాని వాటిల్లో మరోసారి పరిశీలన
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు దాదాపు విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్లయింది. కళాశాలల తనిఖీలు, అనుమతుల పునరుద్ధరణ పేరుతో ఉన్నత విద్యాశాఖ సాగించిన ఈ వ్యవహారంలో విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోయారు. ఎక్కడైనా తనిఖీలు పూర్తి చేసి అనుమతులు పునరుద్ధరిస్తారు. బీఈడీలో అనుమతులు పునరుద్ధరించి కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత మళ్లీ తనిఖీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. గతేడాది అక్టోబరు 22 నుంచి ఉన్నత విద్యామండలి రిజిస్ట్రేషన్లు చేపట్టింది. ఈ సమయంలో కళాశాలలను తనిఖీ చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ అదే నెల 31న విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి వాయిదా పడిన కౌన్సెలింగ్ జనవరి 25 నుంచి ప్రారంభమైంది. అనుమతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొన్ని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హైకోర్టు జనవరి 31 వరకు వాయిదా వేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అనుమతులు లభించని వాటిని పరిశీలించేందుకు ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేస్తామని ఉన్నత విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 411 కళాశాలలు ఉండగా.. తనిఖీల పేరుతో 120 కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు వీటిని మరోసారి పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరోపణలు వచ్చాయి. వాటిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.
9 నెలల సమయమా?
బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్కు గతేడాది మే 6న నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 13న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మరో పక్క ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 28 నాటికి మొదటి సెమిస్టర్ పూర్తి కావాలి. ఫిబ్రవరి చివరిలో కౌన్సెలింగ్ చేపడితే మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మార్చి నెల సగం వరకు గడిచిపోతుంది. ఏప్రిల్తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఈ లెక్కన బీఈడీ విద్యార్థులు ఒక ఏడాది సమయాన్ని కోల్పోతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.