ఓయూలో వరుస ఆందోళనలు
ఈనాడు, హైదరాబాద్: వరుస వివాదాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం సతమతమవుతోంది. యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. విద్యా ప్రణాళికపైనా ప్రభావం పడుతోంది.
ఇవీ నిర్ణయాలు..
పీజీ కోర్సుల్లో సెమిస్టర్ తరగతులు ప్రారంభించిన తర్వాత క్రెడిట్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆచార్యులు బాహాటంగా విమర్శలు చేశారు. వీసీ తీరును తప్పుపడుతూ ఔటా ప్రతినిధులు గవర్నర్, వర్సిటీ కులపతి తమిళిసై సౌందరరాజన్కు ఫిర్యాదు చేశారు. విద్యా ప్రణాళికను రెండు సార్లు మార్చాల్సివచ్చింది. దీంతో తరగతుల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
‣ నిజాం కళాశాలలో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని పీజీ విద్యార్థినులకు కేటాయిస్తూ వర్సిటీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద వివాదం రేగింది. పది రోజులు నిజాం కళాశాలలో యూజీ విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. చివరకు మంత్రుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
‣ హాస్టళ్లలో మెస్లు తెరవకుండా మూసివేయడంతో వీసీ ఛాంబర్ను ముట్టడించారు. ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే దిగొచ్చిన వర్సిటీ అధికారులు మెస్లు ప్రారంభించారు.
‣ ఆగస్టులో పీహెచ్డీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విధానాన్ని తప్పుపడుతూ పలువురు ఆందోళనలకు దిగారు.
ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయాలు: ప్రొ.డి.రవీందర్, ఉపకులపతి
ప్రతి విషయంలోచర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు మేలు చేయాలనే క్రెడిట్స్ కుదింపు నిర్ణయం తీసుకున్నాం. పీజీ విద్యార్థినుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిజాం కళాశాలలో కట్టిన హాస్టల్ను కేటాయించాలనుకున్నాం. కొందరు రాజకీయాలను ఆపాదించుకుని ఆందోళన చేశారు. ఇక క్యాంపస్లో ఈ2 హాస్టల్ విషయం.. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి హాస్టల్, మెస్ సౌకర్యం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.