• facebook
  • whatsapp
  • telegram

DSC Notification: త్వరలో మరో డీఎస్సీ   

* 5 వేలకు పైగా పోస్టులుండే అవకాశం

* నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దు

* ప్రస్తుత డీఎస్సీ రాసి ఉద్యోగాలు పొందండి 

* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
 

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులు ప్రస్తుత డీఎస్సీ పరీక్షలకి బాగా సిద్ధమై 11 వేల ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరోసారి నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్, పీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌ యాదవ్, గిడ్డంగులు, విత్తనాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు నాగేశ్వరరావు, అన్వేష్‌రెడ్డిలతో కలిసి గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు స్పందించి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తాం. పాఠశాలలపై మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11వేల పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది. ఈ ఐదువేలతోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీచేస్తూనే ఉంటుంది. 

తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ఆశ 

ఇటీవల రాష్ట్రంలో 19 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాం. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల ప్రక్రియను వేగవంతం చేశాం. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, డీఎస్సీ ఉద్యోగాలనే భర్తీ చేయలేదు. అప్పట్లో సీఎల్పీ నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్‌ చేయగా నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌లు ఇస్తే పరీక్ష పేపర్‌ లీకయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాం. గత ప్రభుత్వం గ్రూప్‌-2 పరీక్షను మూడుసార్లు వాయిదా వేసింది. వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూప్‌-3 పరీక్షలు వచ్చే నవంబర్‌లో నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశాం. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ప్రభుత్వం ఆశ. డీఎస్సీ పరీక్షలు బాగా రాసి ఉపాధ్యాయులుగా ఎంపికై ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలనేది మా ప్రభుత్వం కోరిక’’ అని భట్టి చెప్పారు. 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.