ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇక ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏదైనా పాఠశాలకు గుర్తింపు ఉందా? ఎన్ని తరగతులకు అనుమతి ఉంది? తమకు సమీపంలో ఏయే పాఠశాలలున్నాయి? వంటి వివరాలను ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ లేదా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులను కలిసి తెలుసుకోవాల్సి వస్తోంది. వారు కూడా పూర్తి వివరాలు ఇస్తారని చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి వివరాలను ఆన్లైన్ ద్వారానే తెలుసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. డీఏవీ పాఠశాలలో అనుమతి లేకుండానే 6, 7 తరగతులు నడుపుతున్నట్లు తేలడంతో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు జిల్లాలు, మండలాల వారీగా విద్యాశాఖ గుర్తింపు ఉన్న పాఠశాలల పేర్లు, అనుమతి ఉన్న తరగతులు, చిరునామా వంటి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,500 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అందులో దాదాపు సగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచితే ఏ పాఠశాలకు, ఎన్ని తరగతులకు అనుమతి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవడానికి వీలవుతుంది. ఎవరైనా అనుమతి లేకుండా బడి నడిపితే ఫిర్యాదు కూడా చేయడానికీ అవకాశం ఉంటుంది. కొన్ని ఇతర రాష్ట్రాల్లో పాఠశాలల వివరాలతో పాటు రుసుముల సమాచారాన్ని కూడా వెబ్సైట్లో ఉంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్బోర్డులో అమల్లోకి ఈ-ఆఫీస్
ఇంటర్బోర్డుతోపాటు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీ కార్యాలయంలో ఈ-ఆఫీస్ అమల్లోకి వచ్చింది. కరోనాకు ముందు ఈ విధానం పాక్షికంగా అమలైంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు కూడా తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది బయోమెట్రిక్ హాజరుకు అవసరమైన ఏర్పట్లకు కసరత్తు ఆరంభించారు. అది విజయవంతమైతే విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ భావిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.