యూడైస్ 2021-22 నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల కొలువులపై కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. కొవిడ్ కారణంగా వందలాది ప్రైవేటు జూనియర్ కళాశాలలు అధ్యాపకులను తొలగించాయి. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్) 2021-22 నివేదిక ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. కరోనాకు ముందు 2019-20 విద్యాసంవత్సరంలో 1,197 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 20,552 మంది అధ్యాపకులు పనిచేసేవారు. మహమ్మారి కారణంగా 2020, మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రత్యక్ష తరగతులు జరగలేదు. ఆ తర్వాతి ఏడాది(2021-22) ముగింపులో ఫిబ్రవరిలో కళాశాలలు తెరుచుకున్నాయి. ఆ రెండు విద్యాసంవత్సరాల్లో పనిచేసిన అధ్యాపకులు వరుసగా 15,225, 15,851 మంది మాత్రమే. అంటే 2020-21లో 5,327 మంది కొలువులను కోల్పోయారు. 2021-22లో 4,701 మంది అధ్యాపకులు తగ్గిపోయారు. ఆన్లైన్ తరగతులు కొనసాగడంతో వందలాది విద్యార్థులకు ఒకే అధ్యాపకుడు బోధించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకున్నాయి. అధ్యాపకుల అవసరం పెద్దగా లేకపోవడంతో ప్రైవేటు జూనియర్ కళాశాలలు వారిని ఉద్యోగాల నుంచి తొలిగించాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం(2022-23)లో కరోనా దాదాపు తగ్గిపోయి సకాలంలోనే కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అధ్యాపకుల సంఖ్య పెరిగిందా? తగ్గిందా? అన్న అంశాలు తేలాలంటే యూడైస్ 2022-23 నివేదిక వెలువడాల్సిందే.
ఒకటో తరగతిలో చేరింది 1,31,310 మందే..
‣ 2021-22 విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో ఒకటో తరగతిలో కొత్తగా 1,31,310 మంది విద్యార్థులే చేరారు.
‣ రాష్ట్రంలో 1-8 తరగతుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలు 29,994 మంది ఉన్నారు. ఇంటర్ వరకు చూస్తే ఆ సంఖ్య 39,737 మంది.
‣ గత విద్యాసంవత్సరం(2021-22) ఒక్క ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ ఒకేషనల్ విద్యను అందించలేదు.
‣ కేవలం 14.30 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.