• facebook
  • whatsapp
  • telegram

AP SI Posts: ఎస్సై ఎంపిక ఫలితాలు ప్రకటించొద్దు

* రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం

* ఎత్తు విషయంలో 2018లో అర్హులైన వారు ఇప్పుడెలా అనర్హులవుతారని ప్రశ్న

ఈనాడు, అమరావతి: తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్సై పోస్టుల ఎంపిక ఫలితాలను ప్రకటించొద్దని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎత్తు విషయంలో 2018లో అర్హులైన అభ్యర్థులు 2023 నోటిఫికేషన్‌లో ఎలా అనర్హులు అవుతారని ప్రశ్నించింది. గతంలో ఉన్న దానికంటే ఎత్తు తగ్గారన్న వాదనను సమ్మతించలేమని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్‌ను ఆదేశించింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను న‌వంబ‌రు 23కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ న‌వంబ‌రు 17న‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎస్సై పోస్టుల భర్తీలో (2023 నోటిఫికేషన్‌) శారీరకదారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌ పరికరాలతో ఎత్తు కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్లు వేశారు. డిజిటల్‌ పరికరాల ద్వారా ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులమయ్యామన్నారు. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు విషయంలో తాము అర్హత సాధించామని, ప్రస్తుతం ఎలా అనర్హులమవుతామని ప్రశ్నించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. మాన్యువల్‌ విధానంలో కొలతలు తీయాలని పోలీసు నియామక బోర్డును ఈ ఏడాది అక్టోబరులో ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాతపరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలతను నిర్వహించిన అధికారులు.. పిటిషనర్లు అందరినీ అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఎ.దుర్గాప్రసాద్‌, మరో 23 మంది హైకోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు.


* న‌వంబ‌రు 17న‌ జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది రేగులగడ్డ వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. ఎత్తు విషయంలో గతంలో అర్హులైన వారిని ప్రస్తుత నోటిఫికేషన్‌లో అనర్హులుగా పేర్కొనడం చట్ట విరుద్ధమన్నారు. ఎత్తు విషయంలో వ్యత్యాస వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఫలితాలను ప్రకటించొద్దని ఆదేశించారు. 2018 నోటిఫికేషన్‌ ప్రకారం జరిగిన ప్రక్రియలో కొంత మంది అభ్యర్థులు 169.1, 168.1 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుత నోటిఫికేషన్‌ ప్రక్రియలో అదే అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లు గుర్తుచేశారు. ఎత్తు తగ్గారన్న వాదనను ఆమోదించలేమని స్పష్టం చేశారు. అంతకు ముందు సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాన్యువల్‌ విధానంలో ఎత్తు కొలత తీసినా పిటిషనర్లు ఎవరూ అర్హత సాధించలేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరారు.



ఎస్‌ఐ : మెయిన్స్ స్టడీమెటీరియల్ 

‣ పేపర్ - 1 : ఇంగ్లిషు ‣ పేపర్ : 2 : తెలుగు
‣ పేపర్ - 3 : అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ‣ పేపర్ - 4 : జనరల్ స్టడీస్
‣ పాత ప్రశ్నప‌త్రాలు ‣ నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.