* ముసాయిదా బిల్లును విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
ఈనాడు, దిల్లీ: దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్-1948ని రద్దుచేసి, ప్రస్తుతం మనుగడలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను తీసుకురానుంది. ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు తెలిపింది. ఆధునిక పరిశోధనల దిశగా ఫార్మసీ వృత్తి నిపుణులను ప్రోత్సహించేందుకు ఈ కొత్త బిల్లు బాటలు వేస్తుందని పేర్కొంది.
కమిషన్ ఏం చేస్తుందంటే...
కొత్తగా ఏర్పడే జాతీయ ఫార్మసీ కమిషన్... ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరిశీలించి పారదర్శకంగా వాటి పని తీరును అంచనా వేస్తుంది. ఫార్మసీ రిజిష్టర్ నిర్వహించేలా నిబంధన విధిస్తారు. ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొందిస్తారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతారు. కమిషన్ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంటుంది. దీనికి ఒక ఛైర్మన్, 13 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 14 మంది పార్ట్టైమ్ సభ్యులు ఉంటారు.
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్-2019 తరహాలోనే కేంద్ర ప్రభుత్వం...జాతీయ ఫార్మా కమిషన్ బిల్లు-2023ని రూపొందించింది. వైద్య ఆరోగ్య విద్యను నియంత్రించే సంస్థలను సంస్కరించి దేశంలో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ బిల్లుపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ మెయిల్కు (hrhcell-mohfw@nic.in) పంపొచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.