బీటెక్ ఈసీఈలో సిలబస్ మార్చాలి
ఎంటెక్లో కోర్సులు... పీహెచ్డీలో పరిశోధన
నిపుణుల కమిటీ నివేదికతో యూజీసీ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: భారతదేశాన్ని 6జీ టెక్నాలజీకి సిద్ధం చేసేందుకు, ఆ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ఇంజినీరింగ్ విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై టెలీ కమ్యూనికేషన్శాఖ నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి తగిన మార్పులు చేయాలని యూజీసీ అన్ని వర్సిటీలను ఆదేశించింది. బీటెక్లో 5జీతో పాటు 6జీపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని, ఎంటెక్లో ప్రత్యేక కోర్సులను తీసుకురావాలని, పీహెచ్డీలో ఆయా అంశాలపై పరిశోధన చేయించాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది. ‘ప్రస్తుతం బీటెక్, ఎంటెక్లో 4జీ వరకు మాత్రమే పాఠాలున్నాయి. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్పై, 5జీపై ప్రాథమికాంశాలు బోధిస్తున్నాం. 5జీపై ఆచార్యులు పరిశోధనా ప్రాజెక్టులను పొందుతున్నారు’ అని జేఎన్టీయూహెచ్ ఈసీఈ సీనియర్ ఫ్రొఫెసర్ మక్కెన మాధవీలత చెప్పారు.‘ ఒకవేళ 6జీ పాఠాలు ప్రవేశపెట్టినా బీటెక్ మూడో సంవత్సరంలో ఆ పాఠ్యాంశాలు వస్తాయి’ అని మల్లారెడ్డి వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం డీన్ ఫ్రొఫెసర్ కె.రవీంద్ర చెప్పారు.
ఎందుకీ మార్పులంటే?
ప్రస్తుతం దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మరోవైపు పలు దేశాలు 6జీ సాంకేతికతపై దృష్టిపెట్టాయి. ఈ రంగంలో భారత్ ముందుండేలా గత మార్చిలోనే కేంద్రప్రభుత్వం భారత్ 6జీ విజన్ పేరిట దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూపు (టీఐజీ), ఆరు టాస్క్ఫోర్స్ కమిటీల సిఫార్సు మేరకు భారత్లో 6జీ సాంకేతికతకు రోడ్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళికను విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో 6జీ సాంకేతికతను అమలు చేయడంతో పాటు పరిశోధకులు, ఇంజినీర్లు నైపుణ్యాలను పెంచుకోవడం తప్పనిసరి. దీనిపై పరిశోధనలను కూడా పెంచితేనే అడ్వాన్స్డ్ టెలీ కమ్యూనికేషన్స్లో దేశం ముందు వరసలో నిలుస్తుంది.
చేయాల్సినవి ఇవీ...
* వస్తున్న మార్పులపై బీటెక్ సిలబస్లో ఎప్పటికప్పుడు కొత్త అంశాలను చేర్చాలి. ఎమర్జింగ్ వైర్లెస్ టెక్నాలజీస్, క్వాంటమ్ కమ్యూనికేషన్, కంప్యూటింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ, గ్రీన్ కమ్యూనికేషన్ తదితర పాఠ్యాంశాలను చేర్చాలి.
* ఎంటెక్లో మిల్లీమీటర్ వేవ్/టెరా హెడ్జ్ కమ్యూనికేషన్స్ అండ్ సెన్సింగ్, ఆప్టికల్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ తదితర కోర్సులను ప్రవేశపెట్టాలి.
* కమ్యూనికేషన్ ఇంజినీరింగ్కు సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ సీట్లను ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు అన్ని కళాశాలల్లో 25 నుంచి 50 శాతం సీట్లను పెంచాలి.
* కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సిలబస్లో మార్పులు చేసేందుకు టెలీ కమ్యూనికేషన్ శాఖ ఓ కమిటీని నియమించి ఈ అంశంలో పీహెచ్డీ చేయాల్సిన అంశాలను గుర్తించింది. ఆప్టికల్ కమ్యూనికేషన్స్, శాటిలైట్
* కమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్, ఆర్ఎఫ్ ఇంజినీరింగ్, టెలికామ్ స్టాండర్డైజేషన్, ఐపీఆర్ తదితర పరిశోధనాంశాలున్నాయి.
* విద్యాసంస్థల్లో ప్రయోగశాలలు, ఓపెన్ సోర్స్ సిమ్యులేటర్లు తదితర మౌలిక వసతులు భారీగా పెంచాలి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.