* 85 మంది రూ.కోటికి పైగా వార్షిక వేతనం
ముంబయి: దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే (IIT Bombay) విద్యార్థులు జాక్పాట్ కొట్టారు. 85 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 నియామకాల సీజన్ ఫేజ్-1లో భాగంగా ఈ వేతన ప్యాకేజీలు అందుకున్నారు. ఐఐటీ బాంబే నిర్వహించిన నియామక ప్రక్రియలో దేశ, విదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1188 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. యాక్సెంచర్, ఎయిర్బస్, యాపిల్, బార్క్లేస్, గూగుల్, జేపీ మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి ప్రఖ్యాత సంస్థలు నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి. కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని సంస్థలు వర్చువల్గా పాల్గొన్నాయి. నియామక ప్రక్రియలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు కొలువులు సాధించారు. తర్వాతి స్థానాల్లో ఐటీ/ సాఫ్ట్వేర్, ఫైనాన్స్/ బ్యాంకింగ్/ ఫిన్టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటివి ఉన్నాయి. జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పనిచేసేందుకు 63 మంది ఎంపికయ్యారు. సగటు ప్యాకేజీలు చూస్తే.. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు సగటున రూ.21.88 లక్షలు అందుకున్నారు. ఐటీ/సాఫ్ట్వేర్ విద్యార్థులు రూ.26.335 లక్షలు.. ఫైనాన్స్ రూ.32.38 లక్షలు, కన్సల్టింగ్ రూ.18.68 లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూ.36.94 లక్షల చొప్పున సగటు వేతనంతో విద్యార్థులు కొలువులు సాధించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.