* వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ
* ఆర్జీయూకేటీ, మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)లను నియమించేందుకు ప్రభుత్వం శనివారం (జనవరి 27) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఉపకులపతుల మూడేళ్ల పదవీకాలం మే నెలాఖరులో ముగుస్తుంది. ఈ క్రమంలో అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఎన్టీయూహెచ్, ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలుగు, ఆర్కిటెక్చర్(జేఎన్ఏఎఫ్ఏయూ), అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలను నియమించనున్నారు. గతంలో 2019 జూన్, జులైలో ఉపకులపతుల పదవీ కాలం ముగియగా.. ఆ తర్వాత రెండేళ్లకు కొత్త వీసీలను గత ప్రభుత్వం నియమించింది. ఈసారి ప్రస్తుత వీసీల పదవీకాలం ముగియడానికి ఒక రోజు ముందే కొత్త ఉపకులపతుల నియామకంపై జీవో జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే నాలుగు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్సైట్ (www.tsche.ac.in) ద్వారా తెలుసుకోవచ్చు.
అన్వేషణ కమిటీల ద్వారా ఎంపికలు
ఉపకులపతుల నియామకానికి ప్రొఫెసర్లుగా 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దానికితోడు నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లలోపు ఉండాలి. అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి.. అర్హుల పేర్లను అన్వేషణ(సెర్చ్) కమిటీకి పంపుతుంది. ఆ కమిటీలో ముగ్గురు సభ్యులు.. యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీ ఉంటారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి మూడు పేర్లను ప్రభుత్వానికి వారు సిఫారసు చేస్తారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్కు పంపుతారు. అందులో ఒకరిని వీసీగా నియమిస్తారు.
ఇక మిగిలేవి ఆర్జీయూకేటీ, మహిళా వర్సిటీలే
రాష్ట్ర ఆవిర్భావం నుంచి బాసరలోని ఆర్జీయూకేటీకి ఉపకులపతిని నియమించలేదు. మిగిలిన వాటికి గవర్నర్ కులపతి కాగా... ఆర్జీయూకేటీకి రాష్ట్ర ఆవిర్భావం దాకా అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడైన రాజిరెడ్డి కులపతిగా వ్యవహరించారు. ఆయన వైదొలిగిన తర్వాతి నుంచి కులపతి ఎవరూ లేరు. ఈ వర్సిటీకి ఉపకులపతిని నియమించాలంటే ముందుగా కులపతిని నియమించడం తప్పనిసరి. ప్రత్యేకంగా కులపతిని నియమిస్తారా? అన్ని వర్సిటీల మాదిరిగా గవర్నర్ను కులపతిగా చేస్తారా? అన్న అంశంపై స్పష్టత వస్తేనే పూర్తిస్థాయి వీసీని నియమించడానికి వీలవుతుంది. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొ.వి.వెంకటరమణ 2022 మే నెల నుంచి ఇన్ఛార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. ఇక కోఠి మహిళా కళాశాలలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తూ రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జి ఉపకులపతిగా ప్రొ.విజ్జులతను నియమించింది. అయితే వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఆ ప్రక్రియ పూర్తయితేనే శాశ్వత వీసీని నియమించేందుకు అవకాశం ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.