• facebook
  • whatsapp
  • telegram

పరీక్ష కేంద్రంలో ఐసొలేషన్‌ గది ఏర్పాటు

ల‌క్ష‌ణాలుంటే అక్క‌డే రాయాలి

కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్వ‌హ‌ణ‌

ఇంటర్‌ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ లక్షణాలతో ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రతి కేంద్రంలో ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ‘విద్యార్థులు కేంద్రంలోకి ప్రవేశించేముందే.. కొవిడ్‌ లక్షణాలను గుర్తిస్తాం. ఐసొలేషన్‌ గదుల్లో వారితో పరీక్ష రాయిస్తాం. అక్కడ ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించే ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందిస్తాం’ అని వివరించారు. ‘కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వాళ్లు పరీక్షకు రాకూడదు. అలాంటివారు సంబంధిత ధ్రువీకరణ పత్రంతోపాటు లిఖితపూర్వక అభ్యర్థన సమర్పిస్తే.. తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు రాసే వెసులుబాటునిస్తాం. అది కూడా సప్లిమెంటరీగా కాకుండా.. రెగ్యులర్‌ పరీక్షగానే పరిగణనలోకి తీసుకుంటాం. మార్కుల జాబితాలపై స్టార్‌ గుర్తులు ఉండవు’ అని చెప్పారు. మే 5 నుంచి మొదలయ్యే ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘మాస్కులు లేకుండా వచ్చేవారికి పరీక్ష కేంద్రంలోనే మాస్కులను ఇస్తాం. కేంద్రాన్ని రోజూ శానిటైజ్‌ చేయిస్తాం. వైద్యశాఖ నుంచి ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున పారామెడికల్‌ సిబ్బందిని పంపాలని కోరాం’ అని వివరించారు.


 

‣ సీఎం పర్యవేక్షిస్తున్నారు...

‘ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో కొవిడ్‌ కంట్రోల్‌ కేంద్రం ఉంటుంది. స్క్వాడ్‌, ప్రత్యేక మొబైల్‌ పార్టీలతోపాటు మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు ఏర్పాటుచేస్తున్నాం’ అని మంత్రి సురేష్‌ తెలిపారు. ‘విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొవిడ్‌పై సెకను కూడా ఆలోచించాల్సిన పనిలేదు. ధైర్యంగా కేంద్రాలకు వచ్చేలా ఏర్పాట్లుచేశాం. సీఎం జగన్‌ రోజూ పర్యవేక్షిస్తున్నారు’ అని వివరించారు. ‘ఎక్కడా, ఏ రాష్ట్రం ఇంతవరకు ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయలేదు. పరీక్షలతో పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది’ అని తెలిపారు.


 

‣ అదనంగా 41 కేంద్రాలు

ఏప్రిల్ 29 సాయంత్రం ఆరింటి నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచారు, వాటి వెనక కొవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముద్రించామని మంత్రి సురేష్‌ వివరించారు. గతేడాది 1,411 పరీక్ష కేంద్రాలు ఉండగా, ఈసారి అదనంగా 41 ఏర్పాటుచేశామన్నారు. 

e books

టెన్త్ క్లాస్ మోడ‌ల్ పేప‌ర్లు

ఇంట‌ర్మీడియ‌ట్ మోడ‌ల్ పేప‌ర్లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.