‣ దేశవ్యాప్తంగా ఆరుగురికి మాత్రమే 100 పర్సంటైల్
‣ 99.9990421తో రాష్ట్ర టాపర్లుగా విశ్వనాథ్, శరణ్య
ఈనాడు, హైదరాబాద్, అమరావతి: జేఈఈ మెయిన్ మొదటి విడత పేపర్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 100 పర్సంటైల్ దక్కలేదు. త్రుటిలో చేజారింది. అయినా పలు విభాగాల్లో అగ్రస్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అమ్మాయిల విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య మొదటి ర్యాంకు సాధించింది. రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయి ఏడోర్యాంకర్ విశ్వనాథ్తో కలిసి మొదటిస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ టాపర్ మనోజ్ఞసాయికి జాతీయ స్థాయిలో పదో ర్యాంకు దక్కింది. దేశవ్యాప్తంగా గత నెల 24-26వ తేదీ వరకు జరిగిన మొదటి విడత పేపర్-1 స్కోర్ను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) మార్చి 8న రాత్రి విడుదల చేసింది. ఈసారి దేశవ్యాప్తంగా ఆరుగురు 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా...వారిలో దిల్లీ నుంచి ఇద్దరు... రాజస్థాన్, చంఢీగడ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మాత్రం ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, బాలికలు, ఓబీసీ కేటగిరీల్లో ఉత్తమ స్థానాలను సాధించడం ఊరటనిచ్చింది. ఎస్టీ విభాగంలో మొదటి మూడు స్థానాలు తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో మొదటి రెండు స్థానాలు ఏపీ విద్యార్థులకు పొందగా...ఆ తర్వాత రెండు స్థానాలు తెలంగాణ విద్యార్థులు సాధించారు. దేశ వ్యాప్తంగా 6,20,978 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి తెలుగు సహా 13 భాషల్లో తొలిసారిగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి జేఈఈని ఏటా నాలుగుసార్లు చొప్పున నిర్వహిస్తున్నారు. తదుపరి విడత పరీక్షలు మార్చితో పాటు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగుసార్లు హాజరు కావచ్చు. వాటిలో ఏది ఉత్తమ స్కోరు అయితే దానిని పరిగణనలో తీసుకుంటారు. తుది ర్యాంకుల్ని మే పరీక్ష తర్వాత ప్రకటిస్తారు.
బొంబాయి ఐఐటీలో చదవాలన్నది నా ఆశయం
మాది చిత్తూరు జిల్లా పీలేరు. మా నాన్న రమేశ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ చదవాలన్నది నా ఆశయం. ఇందు కోసం కష్టపడి చదువుతున్నా. మరో మూడు పర్యాయాలు నిర్వహించనున్న పరీక్షల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తా.
- పోతంశెట్టి చేతన మనోజ్ఞ సాయి(ఏపీ టాపర్), పీలేరు, చిత్తూరు
మరింత మంచి ర్యాంకు కోసం ప్రయత్నిస్తా
బొంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ చదవాలన్నది చిన్నప్పటి నుంచి కల. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి మార్కులు సాధించి, సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నా. జేఈఈ మెయిన్ రాసేందుకు మరో మూడు అవకాశాలున్నాయి. వీటిల్లో మరింత మంచి ర్యాంకు తెచ్చేకునేందుకు ప్రయత్నిస్తా’
- అనుముల వెంకట జయ చైతన్య(ఈడబ్ల్యూఎస్ విభాగంలో మొదటి ర్యాంకు) నంద్యాల, కర్నూలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.