ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 27 నుంచి 30 వరకు తలపెట్టిన మూడో విడత జేఈఈ మెయిన్ నిర్వహణ సందేహంగా మారింది. కరోనా ఉద్ధృతితో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 18న ఒకపూట జరగనున్న నీట్ 2021-పీజీ పరీక్షను వాయిదా వేసిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ నిర్వహణ కష్టమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నీట్ పీజీకి సుమారు 1.75 లక్షల మందే దరఖాస్తు చేయగా.. జేఈఈ మెయిన్కు మొత్తం 5 లక్షల మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ను సైతం వాయిదా వేయవచ్చని భావిస్తున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లానే జేఈఈ మెయిన్ను కూడా వాయిదా వేయాలని ఇప్పటికే విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్రాన్ని కోరుతున్నారు. కరోనా చికిత్సలో వైద్య విద్యార్థులూ పాల్గొంటున్నందున నీట్-పీజీ వాయిదా వేశారని, జేఈఈ మెయిన్పై ఏం చేస్తారన్నది మరో నాలుగు రోజుల్లో వెల్లడవుతుందని జేఈఈ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పరీక్షకు కనీసం వారం ముందుగా వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచాలని, అంటే ఏప్రిల్ 20 నాటికి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.