* సాంకేతిక సమస్యలతో వెబ్ ఆప్షన్లకు ఇబ్బందులు
* రాష్ట్రంలో 600 కళాశాలల అనుబంధ గుర్తింపు నిలిపివేత
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ఆన్లైన్ ప్రవేశాల్లో చాలా కార్పొరేట్ కళాశాలలు కనిపించకుండా పోయాయి. అగ్నిమాపక భద్రత ధ్రువీకరణ పత్రాలు లేవని, వాణిజ్య భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నారని, ఎంపీసీ, బైపీసీ సీట్ల విభజన వివరాలను యాజమాన్యాలు సమర్పించలేదనే కారణాలతో ఇంటర్ విద్యా మండలి అనుమతులు నిలిపివేసింది. దీంతో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ ప్రవేశాల్లో ఆయా కళాశాలల వివరాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 2 వేల ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వివిధ కారణాలతో 600 కళాశాలల అనుబంధ గుర్తింపును ఇంటర్ విద్యామండలి నిలిపివేసింది. ఐఐటీ, నీట్లో సీట్ల కోసం చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. కృష్ణా జిల్లా మొత్తం మీద కార్పొరేట్ కళాశాలల బ్రాంచీలు రెండు మాత్రమే ఆన్లైన్లో ఉన్నాయి. మరోవైపు ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము, వెబ్ ఆప్షన్లకు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కొందరికి రుసుము చెల్లించిన తర్వాత నాలుగైదు గంటలకుగానీ పాస్వర్డ్ రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇంతవరకు బోధన రుసుములను నిర్ణయించలేదు. కొత్తగా ఎన్ని కళాశాలలకు అనుమతులు ఇచ్చారు. ఎన్ని సీట్లు ఉన్నాయో వెబ్సైట్లో కనిపించని పరిస్థితి. సాంకేతిక సమస్యలు, కళాశాలల జాబితాలపై అధికారులను సంప్రదిస్తున్నా సరైన స్పందన కనిపించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.