* 16,400 మంది బీటెక్ విద్యార్థులకు పూర్తిగా చెల్లింపు
ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా లెక్క తేల్చిన అధికారులు
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ కన్వీనర్ కోటా కింద బీటెక్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారిలో 32.6 శాతం మంది పూర్తి బోధనా రుసుం పొందేందుకు అర్హులు. అంటే మూడోవంతు మంది 100 శాతం ఫీజు పొందుతారు. వారికి ఇంజినీరింగ్ కళాశాలలో వార్షిక రుసుం ఎంత ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. మరో 47 శాతం మందికి రూ.35,000 వరకు చెల్లిస్తారు. ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కావడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఫీజు రీఎంబర్స్మెంట్ అర్హులకు సంబంధించిన గణాంకాలను సేకరించింది. కన్వీనర్ కోటాలో చేరిన అర్హులకు మాత్రమే ప్రభుత్వం బోధనా రుసుం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ఏ కళాశాలలో చేరినా, ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిగా బోధన రుసుం చెల్లిస్తారు. 10,000 ర్యాంకు లోపు ఉండి.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 2 లక్షల లోపు ఉన్నవారికీ పూర్తిగా మంజూరు చేస్తారు. మిగిలిన వారికి కళాశాల ఫీజు ఎంతున్నా రూ.35,000 మాత్రమే ఇస్తారు. అదీ కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని అర్హులైతేనే మంజూరుచేస్తారు. ఎంసెట్ కౌన్సెలింగ్లో విద్యార్థులు ఇచ్చే కుటుంబ ఆదాయ ధ్రువపత్రాన్ని పరిశీలించి అప్పటికప్పుడు అర్హులా? కాదా? ఎంత మొత్తానికి అనేది నిర్ధారిస్తారు. సీటు కేటాయింపు ఆర్డర్లోనూ ఎంత ఫీజు చెల్లించాలో పొందుపరుస్తారు. సీట్లు దక్కిన విద్యార్థుల్లో మొత్తం 80 శాతం వరకు ఫీజు రీఎంబర్స్మెంట్కు అర్హులున్నారని అధికారులు లెక్కలు తేల్చారు.
*తొలి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారు: 50,288 మంది
* పూర్తి బోధనా రుసుం పొందేందుకు అర్హుల సంఖ్య: 16,400 (32.6 శాతం)
* రూ.35,000 మాత్రమే పొందేందుకు అర్హులు: 23,800 (47 శాతం)
* బోధన రుసుం పొందేందుకు అర్హులు కాని వారు: సుమారు 10,000మంది (20 శాతం)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.