* 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు డిజిటల్, విజయవాడ: కానూరు, న్యూస్టుడే: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా షార్ట్లిస్టులను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈసారి కూడా రోస్టర్ విధానంలోనే అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. ఫలితంగా సంబంధిత వెబ్సైట్లో మార్కులు చూసుకున్న అభ్యర్థులు.. తమ చేతికి నియామకపత్రం అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఈసారి మచిలీపట్నంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో శాఖ వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పరిశీలనకు వచ్చే అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పించనున్నారు.
జిల్లాలో 14 ప్రభుత్వ శాఖల పరిధిలో మూడు కేటగిరీల్లో 1425 పోస్టులకు గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించారు. సుమారు 87,136 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. వీటిలో కేటగిరీ-1 పోస్టులకే ఎక్కువ మంది పోటీపడ్డారు. దాదాపు 40,931 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతంలో కటాఫ్ మార్కులు ప్రకటించి ఆ లోపు మార్కులు సాధించిన వారిని పోస్టులకు పిలుపునిచ్చేవారు. ఈ సారి కటాఫ్ మార్కులు లేకుండా మెరిట్, రోస్టర్ ప్రకారం షార్ట్ లిస్ట్ల తయారీ చేసే బాధ్యతను సంబంధిత శాఖలకే అప్పగించారు. వాటిని గ్రామ/వార్డు సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులై, మెరిట్ సాధించిన వారికి 1 : 2 ప్రకారం కాల్లెటర్లు పంపనున్నారు. అర్హుత సాధించిన అభ్యర్థులకు కాల్లెటర్లను వారి మెయిల్ ఐడీలకు పంపించనున్నారు. మొదటి విడత ఉద్యోగాల భర్తీ సమయంలో ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలో జరిగింది. ఈ సారి మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జడ్పీ సీఈవో సూర్యప్రకాష్ తెలిపారు.
నవంబర్ 2 నుంచి ప్రక్రియ ప్రారంభం
ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 2వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్టు తయారు చేసి నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు కాల్లెటర్లు పంపుతారు. అలాగే 2 నుంచి పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను అదే రోజు నుంచే నియామకపత్రాలు జారీ చేయనున్నారు.
అభ్యర్థులు ఇవీ మర్చిపోవద్ధు!
* కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు ధ్రవపత్రాల పరిశీలనకు ముందుగానే సంబంధిత వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయాలి.
* రెండు సెట్ల అటెస్ట్ చేసిన ధ్రువపత్రాలు, రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలు ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చేటప్పుడు తీసుకురావాలి.
* ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రాలు, బీసీలు నాన్-క్రిమిలేయర్ ధ్రువపత్రాలను తెచ్చుకోవాలి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.