* జేఎన్టీయూ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్లో 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గించకూడదని జేఎన్టీయూ నిర్ణయించింది. మొదటి ఏడాది తరగతులు ఆలస్యమైన కారణంగా సిలబస్ కుదించి సెమిస్టర్లు నిర్వహిస్తారన్న చర్చ నడుస్తోంది. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని భావించి, సిలబస్ కుదించకుండా పూర్తిస్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని జేఎన్టీయూ భావిస్తోంది. వేసవి, ఇతర సెలవులు తగ్గించుకుంటూ విద్యా సంవత్సరం నిర్వహించనుంది. పరీక్షల్లో ఐచ్ఛికాలు సెమిస్టర్ పరీక్షల పరంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ విద్యా సంవత్సరాన్ని డిసెంబరు ఒకటి నుంచి ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా జేఎన్టీయూ అధికారులు మొదటి ఏడాది తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు పునఃప్రారంభించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో తొలుత ఆన్లైన్లో తరగతులు జరగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు, నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఆన్లైన్లో బోధన నడుస్తోంది. మొదటి ఏడాది తరగతులు ఈ నెలాఖరు లేదా డిసెంబరు ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి.
10 గ్రేస్ మార్కులు
బీటెక్, బీఫార్మసీ 2019-20 సంవత్సరం నాలుగో ఏడాది రెండో సెమిస్టర్(4-2) ఫలితాలను జేఎన్టీయూ ప్రకటించింది. బీటెక్లో 63.4శాతం మంది ఉత్తీర్ణత సాధించగా బీఫార్మసీలో 47.8శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి గ్రేస్ మార్కుల కింద పది మార్కులు కలపాలని జేఎన్టీయూ నిర్ణయించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.