* కనీసం రూ.35వేలు, గరిష్ఠం రూ.82వేలు
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ బోధన రుసుముల కసరత్తు కొలిక్కి వచ్చింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన రుసుములను దాదాపు ఖరారు చేసింది. విశ్వవిద్యాలయాల నుంచి కళాశాలల అనుబంధ గుర్తింపు జాబితా రాగానే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలల జాబితాను సిద్ధం చేయగా.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో జాబితాకు రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. బోధన రుసుముల నిర్ణయం తర్వాత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఐచ్ఛికాలు ప్రారంభం కానున్నాయి.
ఇంజినీరింగ్ కళాశాలలకు కనీస బోధన రుసుము రూ.35 వేలు ఉండనుంది. గరిష్ఠంగా రూ.82 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఒక ప్రత్యేక కళాశాలకు రూ.90 వేలు, మరోదానికి రూ.95వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. గతేడాది గరిష్ఠంగా రూ.70 వేలు ఉండగా.. దీన్ని కొంత పెంచినట్లు సమాచారం. 2017-18 వరకు వర్సిటీలకు అనుబంధ గుర్తింపు ఫీజులు చెల్లించని కళాశాలలపై చర్యలు తీసుకునే కసరత్తు కొనసాగుతూనే ఉంది. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 125 కళాశాలలు ఉండగా.. ఇందులో 14 కళాశాలల్లో 25% లోపు ప్రవేశాలున్నాయి. వీటికి ఈ ఏడాదికి అనుబంధ గుర్తింపు నిలిపివేయడమా? కోర్సులను తగ్గించడమా? అనేదానిపై వర్సిటీ నిర్ణయం తీసుకోనుంది.
* రాష్ట్రంలో సుమారు 55 కళాశాలలకు ఎలాంటి బోధన రుసుమును నిర్ణయించే అవకాశం లేదు. వీటిలో ఈ ఏడాదికి ప్రవేశాలు ఉండకపోవచ్చు. నాణ్యత ప్రమాణాలు పాటించని వాటికి సున్నా బోధన రుసుమును నిర్ణయించనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి 274 ప్రైవేటు కళాశాలలకు అనుమతులు మంజూరుచేసింది. విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు నిలిపివేస్తే వీటి సంఖ్య 219కి చేరే అవకాశం ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.