* వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్, దంత వైద్య విద్య కోర్సులకు ఎ, బి, సి కేటగిరీ ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నవంబరు 5 న ఉత్తర్వులు జారీచేసింది. 2019-20లో అమలులో ఉన్న బి, సి కేటగిరీ ఫీజులను తగ్గించింది. కన్వీనర్ కోటా ఫీజును స్వల్పంగా పెంచింది. ఈ కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయి. రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నట్లు ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో యూజీ/డెంటల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు చదువులు పూర్తి చేసేంత వరకు ఈ ఫీజులు మాత్రమే చెల్లించాలి. ఎంసీఐ/ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు ఫీజులు వసూలుచేయాలి.
ఫీజుల వివరాలు
ఎంబీబీఎస్ కోర్సుకు: రాష్ట్రంలో 17 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఎంబీబీఎస్కు 2019-20 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా ఫీజు కింద రూ.12,155 వసూలు చేశారు. దీనిని ప్రస్తుతం రూ.15 వేలు చేశారు.
* ‘బి’ కేటగిరీ సీటు ఫీజు రూ.13,37,057 ఉండగా రూ.12 లక్షలుగా ఖరారు చేశారు.
*‘బి’ కేటగిరీ ఫీజులో ఐదు రెట్లకు మించకుండా ‘సి’ కేటగిరి సీట్లను ఇప్పటివరకు యాజమాన్యాలు భర్తీ చేసుకొన్నాయి. ఇకపై సి కేటగిరీ సీటు కింద రూ.36 లక్షలు మాత్రమే వసూలుచేయాలి.
దంత వైద్య విద్యకు..
రాష్ట్రంలో 14 ప్రైవేట్ దంత వైద్య కళాశాలలు ఉన్నాయి. కన్వీనర్ కోటా ఫీజు కింద రూ.12,155ను ఇప్పటివరకూ వసూలుచేశారు. దీనిని తాజాగా రూ.13వేలు చేశారు.
‘బి’ కేటగిరీ సీటు ఫీజు రూ.5,46,978 ఉండగా...దీనిని రూ.4,00,000కు తగ్గించారు.
సి కేటగిరీ సీటు ఫీజును ‘బి’ కేటగిరి లో ఐదింతలకు మించకుండా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.12 లక్షలకు పరిమితం చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫీజు రూ.15 లక్షలు. రాష్ట్రంలో 5 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాత్రమే సూపర్ స్పెషాలిటీ కోర్సుల సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.24 లక్షలు వసూలు చేస్తున్నారు. దీనిని రూ.15 లక్షలకు పరిమితం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.