• facebook
  • whatsapp
  • telegram

డిసెంబ‌ర్ 2నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

* 5న వైద్యవిద్య తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు
* 8న కళాశాలల్లో చేరికకు తుది గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో తొలి విడత సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు తెరలేచింది. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఇప్పటికే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జాబితాలోని వారంతా ప్రాధాన్య క్రమంలో వైద్య కళాశాలను ఎంచుకోవడానికి వర్సిటీ పచ్చజెండా ఊపింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో సీటు పొందడానికి నచ్చిన వైద్య కళాశాలల ఐచ్ఛికాలను డిసెంబ‌రు 2న ఉదయం ఏడింటి నుంచి 4న సాయంత్రం 7 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఇవ్వాలంటూ డిసెంబ‌రు 1న‌ ప్రకటన విడుదల చేసింది. వైద్యకళాశాలల వారీగా ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయనీ, మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది. 3 రోజుల ఆన్‌లైన్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం డిసెంబ‌రు 5న తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో చేరేందుకు డిసెంబ‌రు ఎనిమిదో తేదీని తుది గడువుగా నిర్ణయించనున్నట్లు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. కన్వీనర్‌ కోటాలో తొలి విడత ప్రక్రియ పూర్తయ్యాక ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో తొలి విడత ప్రవేశాలు నిర్వహిస్తారు. అఖిల భారత వైద్యవిద్య కోటాలో రెండో విడత ప్రవేశాల్లో సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. కేటాయించిన కళాశాలల్లో చేరడానికి 8ని తుది గడువుగా నిర్ణయించారు. తర్వాత కూడా ఆ కోటాలో సీట్లు మిగిలితే.. వాటిని తిరిగి రాష్ట్రాలకు 15 శాతం నిబంధనల మేరకు అందజేస్తారు. ఈ లెక్కన రాష్ట్రానికి 8వ తేదీ అనంతరం అఖిల భారత కోటా నుంచి మిగులు సీట్లు ఏమైనా వస్తే.. వాటినీ కలుపుకొని రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో రెండో విడత ప్రవేశాలను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.