* కన్వీనర్ కోటాలో 76 సీట్లు అందుబాటులో..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి లభించింది. సిద్దిపేట జిల్లాలోని సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 2020-21 వైద్య విద్య సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లను పునరుద్ధరిస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అనుమతించింది. వైద్యవిద్య ప్రవేశాల గడువు ముగిసిపోతున్న ఆఖరి దశలో అనుమతి లభించడంతో.. కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఇందుకనుగుణంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహించనుంది. తాజాగా పునరుద్ధరించిన సీట్లలో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనుండగా.. మిగతా సీట్లను యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో భర్తీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇప్పటి వరకూ మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియను నిర్వహించగా.. మరో 26 ఎంబీబీఎస్ సీట్లు మిగిలినట్లుగా తెలుస్తోంది. ఈ సీట్లకు తాజాగా అందుబాటులోకి వచ్చిన 50 సీట్లను కలుపుకొని మొత్తంగా 76 ఎంబీబీఎస్ సీట్లకు కన్వీనర్ కోటాలో ఆఖరి విడతగా ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.
జనవరి 4నుంచి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా తుదివిడత కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య వర్సిటీ జనవరి 3న తుదివిడత ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. జనవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 9 గంటల వరకూ అర్హులైన అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన అర్హుల జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ విడత ప్రవేశాల్లో పాల్గొనవచ్చని వర్సిటీ స్పష్టంచేసింది. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో చూడాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.