• facebook
  • whatsapp
  • telegram

అంకుర సంస్థ‌ల‌పై జేఎన్‌టీయూ ప్ర‌త్యేక విధానం

* విద్యార్థులను ప్రోత్స‌హించేందుకు వ‌ర్సిటీ కీల‌క నిర్ణ‌యం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థి దశలో అంకురసంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జేఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలు ఏర్పాటు చేయాలనుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా క్రెడిట్స్‌ ఇవ్వడంతో పాటు సెమిస్టర్‌లో పది శాతం హాజరు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యార్థి అంకురసంస్థల విధానాన్ని (ఎస్‌ఎస్‌పీ) జేఎన్‌టీయూ తీసుకువచ్చింది. దీనికి ఇటీవల ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన జరిగిన వర్సిటి పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఇప్పటికే జేఎన్టీయూలో జె-హబ్‌ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. తాజా విధానం ద్వారా ఏదైనా ఉత్పత్తిని అభివృద్ధి చేయడం, డిజైన్‌, నిర్ణయాధికారం, సృజనాత్మక ఆలోచన, సమస్యలను స్వయంగా పరిష్కరించేతత్వం విద్యార్థుల్లో అలవడుతుందని జయేశ్‌రంజన్‌ తెలిపారు. క్రెడిట్స్‌, హాజరు మినహాయింపులకు సంబంధించి వర్సిటీ నియమించిన ప్రత్యేక కమిటీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 
నూతన విధానంలోని ముఖ్యాంశాలు..
* అంకుర సంస్థల ఏర్పాటులో పాల్గొనే విద్యార్థులకు స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ తరహాలో అత్యధికంగా పదిశాతం వరకు హాజరు మినహాయింపు లభిస్తుంది. అంకురసంస్థ ఏర్పాటులో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. అంకురసంస్థ ఏ దశలో ఉందనే విషయంపై హాజరు మినహాయింపు శాతం ఆధారపడి ఉంటుంది. ఇందుకుగాను సెమిస్టర్‌ ప్రారంభమైన నెలరోజుల్లోగా కమిటీకి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి.
* జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యశాలలు, వర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహించే సదస్సులకు సెలవు మంజూరు చేస్తారు.
* రెండో ఏడాది పూర్తి చేసుకున్నాక ఏడాది వ్యవధి తీసుకుని అంకురసంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ తర్వాత నిర్దేశిత సమయంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేయాలి.
* విద్యార్థులకు 18-20 క్రెడిట్స్‌ సాధించే అవకాశం కల్పించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌, ప్రోడ‌క్ట్స్‌‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మూక్స్‌ ద్వారా 5-6 సెమిస్టర్లలో కోర్సులు చేసి ఉండాలి.
* ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే కళాశాలలకు ఏటా ర్యాంకింగ్‌లు కేటాయిస్తారు.
* వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి ప్రోటోటైప్‌, కేస్‌ స్టడీ నివేదిక, సమస్యలను పరిష్కరించే ప్రాజెక్టులు, మొదటి ఏడాది నుంచి సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు మినీ ప్రాజెక్టు ఆధారిత క్రెడిట్స్‌ మంజూరు చేస్తారు.
* ఇంకుబేటర్స్‌, టీబీఐ, ఎంఎస్‌ఎంఈ కేంద్రాలతో కలిసి ప్రాజెక్టులు చేస్తే మేజర్‌ ప్రాజెక్టు కింద పరిగణిస్తారు.
* ఎలక్టివ్‌ సబ్జెక్టుల విషయంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు అవసరమైన వాటిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.