‣ వేగంగా సమాచార సేకరణకు సీఎం ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: పదోన్నతుల ప్రక్రియ జనవరి నెలాఖరుకు ముగించి, ఆ వెంటనే అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమాచారం వచ్చిన వెంటనే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఖాళీల సమాచారాన్ని, ఉద్యోగ నియామకాలను అత్యంత ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని చెప్పారు. వారం గడువు ఉన్నందున అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రగతిభవన్లో జనవరి 24న సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా పీఆర్సీతో పాటు పదోన్నతుల ప్రక్రియ, కారుణ్య నియామకాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు తదితరాలపై అధికారులు నివేదిక ఇచ్చారు. వాటి పురోగతిని సీఎం సమీక్షించారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల అనంతరం పరిస్థితిని సమీక్షించి, తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.
‣ పదోన్నతులు పారదర్శకంగా జరగాలి
పదోన్నతుల ప్రక్రియ తీరుపై ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారానికి సంబంధించిన అంశాల గురించి సీఎం చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, వీలైనంత ఎక్కువ మందికి పదోన్నతులు కల్పించాలని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగరాదన్నారు. రోస్టర్ పేరిట హైదరాబాద్ జలమండలి మరికొన్ని విభాగాల్లో కొందరికి పదోన్నతులు నిలిపివేసిన అంశం గురించి సీఎం ప్రస్తావించారు. అర్హులందరికీ పదోన్నతులిచ్చి, ఖాళీలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.