* తెలుగులో రాసేది 371 మందే
* ఈసారి నాలుగు విడతల్లో పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరిగే తొలి విడత జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలకు దాదాపు 6.61 లక్షలమంది పోటీపడుతున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే 1.61 లక్షల మందికిపైగా ఉన్నారు. అంటే 24.41 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులే. ఈసారి జేఈఈ మెయిన్ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నాలుగు విడతల్లో మొత్తం 21.75 లక్షలమంది దరఖాస్తు చేశారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.64 లక్షలమంది దరఖాస్తు చేయగా ఆ తర్వాత 2.54 లక్షలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర్ప్రదేశ్ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటివరకు కేవలం 371 మందే తెలుగులో ప్రశ్నపత్రం కావాలని దరఖాస్తు చేశారు. ఫిబ్రవరిలో పరీక్షకు ఏపీ నుంచి 87,797 మంది, తెలంగాణ నుంచి 73,782 మంది దరఖాస్తు పెట్టుకున్నారు.
మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..
ఒకేసారి నాలుగుసార్లకు కలిపి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో కొందరు రెండు, మూడు, నాలుగుసార్లుకు రుసుం చెల్లించారు. ఫిబ్రవరి పరీక్ష తర్వాత మళ్లీ మార్చి పరీక్ష రిజిస్ట్రేషన్కు అవకాశం ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు అప్పుడూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఆసక్తి లేకుంటే మార్చి, ఏప్రిల్, మే పరీక్షలకు చెల్లించిన ఫీజు వెనక్కి తీసుకోవచ్చు. అందువల్ల ఇప్పటివరకు ఫిబ్రవరి పరీక్షకు మాత్రమే దరఖాస్తుల సంఖ్య 6,61,761గా చెప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.