* నిధుల కొరతకు ఇదో పరిష్కారం
* కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్- పీపీపీ)తో వైద్య విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తద్వారా ప్రైవేటు నుంచి ఆర్థిక వనరులు సమకూరుతాయని, నిధుల కొరత తీరుతుందని పేర్కొంది. ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడానికి 2 నుంచి 4 ప్రైవేటు సంస్థలు కూడా కలిసి ముందుకు రావచ్చని తెలిపింది. దేశంలో వైద్య కళాశాలలకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ తాజా సమాచారాన్ని విడుదల చేసింది.
‣ ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ తక్కువ ఎంబీబీఎస్ సీట్లకు దరఖాస్తు చేసుకుంటే.. ఆ సంఖ్యకు తగ్గట్లుగా మానవ వనరులను నియమించుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా అనవసర ఆర్థిక భారం తగ్గుతుంది.
‣ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన తర్వాత మూడో సంవత్సరానికి గుర్తింపు రాగానే.. నాన్ క్లినికల్ పీజీ కోర్సుల ప్రారంభానికి అనుమతి వస్తుంది.
‣ ఎంబీబీఎస్ సీట్లను గరిష్ఠంగా 150 నుంచి 250 వరకూ పెంచుకోవడానికి వెసలుబాటు కల్పించింది.
‣ వైద్య బోధనకు ఎండీ, ఎం.ఎస్, డీఎం, ఎంసీహెచ్ తదితర పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసినవారే అర్హులుగా ఉండగా.. తత్సమానమైన డీఎన్బీ చేసిన వారు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది.
‣ జిల్లా ఆసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపింది. వాటికి అనుబంధంగా మెడికల్ కాలేజీలను నెలకొల్పాలని గతంలో నిర్ణయించామనీ, ఈ దిశగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 157 వైద్య కళాశాలలకు అనుమతిచ్చినట్లు పేర్కొంది.
‣ అత్యధిక కర్ణాటకలో పీజీ వైద్య సీట్లు
దేశం మొత్తమ్మీద 562 వైద్య కళాశాలలుండగా.. 42,182 పీజీ సీట్లున్నాయి. తెలంగాణలో 34 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,237, ఆంధ్రప్రదేశ్లోని 31 వైద్య కళాశాలల్లో 2,371 పీజీ సీట్లు ఉన్నాయి. అత్యధికంగా కర్ణాటకలో 5,379 ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.