‣ వేతనం రూ.80 వేలు
నర్సింగ్ విద్యను పూర్తిచేసుకున్నవారికి దేశంలోని ప్రముఖ ఆసుపత్రి కేంద్రాల్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎంపికైతే ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రకటన వెలువరించింది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు ఉంటాయి. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.80 వేల వేతనం అందుకోవచ్చు!
పోస్టులను నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎన్ఓఆర్సెట్)లో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆరు నెలలు లేదా తర్వాత పరీక్ష వరకు చెల్లుతుంది. ఈ వ్యవధిలో ఎయిమ్స్ల్లో కొత్త ఖాళీలు ఏర్పడితే ఈ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలు నియామకాలు చేపట్టే సమయానికి పెరగడానికీ అవకాశం ఉంది. మొత్తం పోస్టుల్లో 80 శాతం మహిళలకు కేటాయించారు. మిగిలిన 20 శాతం పురుషులతో నింపుతారు.
పరీక్ష ఇలా
దీన్ని 3 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఇందులో 180 సబ్జెక్టుకు సంబంధించినవే ఉంటాయి. మిగిలిన 20 జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైనదాన్ని గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. తప్పు సమాధానానికి మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులైతే వారి కేటగిరీ అనుసరించి 5 శాతం సడలింపు వర్తిస్తుంది. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల సిలబస్ నుంచి ఉంటాయి. అందువల్ల ఆ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షల్లోని ప్రశ్నలు సాధన చేసినవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు.
నియామకాలు
పరీక్షలో అర్హత సాధించినవారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా పోస్టులు కేటాయిస్తారు. ఇలా విధుల్లో చేరినవారిని కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం రూ.44,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ అదనంగా ఉంటాయి. అంటే మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.80 వేల వేతనం అందుకోవచ్చు. దశలవారీ పదోన్నతులూ ఉంటాయి.
ఎయిమ్స్ కేంద్రాల వారీ ఖాళీల వివరాలు:
బఠిండా 142, భోపాల్ 51, భువనేశ్వర్ 169, బీబీనగర్ 150, బిలాస్పూర్ 178, దియోఘర్ 100, గోరఖ్పూర్ 121, జోధ్పూర్ 300, కల్యాణి 24, మంగళగిరి 117, నాగ్పూర్ 87, రాయ్ బరేలీ 77, న్యూదిల్లీ 620, పట్నా 200, రాయ్పూర్ 150, రాజ్కోట్ 100, రిషికేష్ 289, జమ్మూ 180
అర్హత: బీఎస్సీ నర్సింగ్/ పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం తోపాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం.
వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తులు: మే 5 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ రూ.2400. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ పరీక్ష తేదీ: జూన్ 3
వెబ్సైట్: https://aiimsexams.ac.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్కిటెక్చర్ ప్రవేశానికి మార్గం.. నాటా
‣ సమాచార విశ్లేషణకు ‘క్విక్సైట్’
‣ కేంద్రంలో 7,500 కొలువుల భర్తీ
‣ తెలంగాణ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాలు