‣ వెయ్యికిపైగా ఖాళీలతో ఎఫ్సీఐ ప్రకటన
భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఎఫ్సీఐ) ఉద్యోగార్థులకు తీపికబురు అందించింది. తమ సంస్థలో వివిధ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో సౌత్ జోన్లో దాదాపు వెయ్యి అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలున్నాయి. నిర్దేశిత డిగ్రీలతో వీటికి పోటీ పడవచ్చు. ఆ వివరాలు...
ఈ నోటిఫికేషన్కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు సౌత్ జోన్ కిందికి వస్తాయి. ఇందులో మేనేజర్ పోస్టులు 16, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 989 ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
మేనేజర్ పోస్టులు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ కనీసం 60శాతం మార్కులతో పాసై ఉండాలి. మేనేజర్ (హిందీ) పోస్టులకు పీజీతోపాటు 5 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.
‣ వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి.
‣ పే స్కేల్ - రూ.40,000 - రూ.1,40,000.
‣ పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఫీజు లేదు. ఇతరులు రూ.800 చెల్లించాలి.
‣ ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ అనంతరం తుది ఎంపిక చేస్తారు. రాతపరీక్షను ఫేజ్ 1, ఫేజ్-2లుగా విభజించారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
‣ ఫేజ్-1 పరీక్ష పేపర్ అభ్యర్థులు అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు, గంటలో జవాబులు రాయాలి.
‣ ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ - ఈ అంశాల నుంచి 25 మార్కుల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి.
‣ ప్రతీ తప్పు జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.
‣ ఈ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణించరు.
‣ ఫేజ్-2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటాయి. పేపర్ 1 ఫేజ్-1 అంశాల నుంచే 120 మార్కులకు ఉంటుంది.
‣ పేపర్ 2లో పోస్టు స్పెషలైజేషన్ను బట్టి సంబంధిత సబ్జెక్ట్పై 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 120 మార్కుల పేపర్ ఒక గంటలో పూర్తిచేయాలి.
‣ పేపర్-3లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అంశాలపై 120 మార్కులకు 120 ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షను గంటన్నరలో పూర్తిచేయాలి.
‣ పేపర్ 4లో హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీకు అనువాదంపై ప్రశ్నలు ఉంటాయి. 120 మార్కుల ప్రశ్నపత్రాన్ని గంటన్నరలో పూర్తిచేయాలి.
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇందులో జేఈ (సివిల్), జేఈ (ఎలక్ట్రికల్ మెకానికల్), స్టెనో గ్రేడ్-2, ఏజీ 3 (జనరల్), ఏజీ 3 (అకౌంట్స్), ఏజీ 3 (టెక్నికల్) ఏజీ 3 (డిపో), ఏజీ 3 (హిందీ) పోస్టులు ఉన్నాయి.
‣ పే స్కేల్: రూ.28,200 - రూ.103400.
‣ విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా ఒక ఏడాది అనుభవంతో డిప్లొమా ఉండాలి. పోస్టును అనుసరించి కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ షార్ట్హ్యాండ్ అవసరం.
‣ వయసు: 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి.
‣ పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. ఇతరులు రూ.500 చెల్లించాలి.
‣ ఎంపిక: ఫేజ్ 1, ఫేజ్ 2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
‣ ఫేజ్ 1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ - కరెంట్ అఫైర్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున మొత్తం వంద ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తిచేయాలి.
‣ ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
‣ ఫేజ్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. అయితే అభ్యర్థులు అందరూ అన్ని పరీక్షలూ రాయాల్సిన అవసరం లేదు. ఏ పోస్టును ఎంపిక చేసుకున్నారనేదాన్ని బట్టి ఏ పేపర్లు రాయాలనే అంశం ఆధారపడి ఉంటుంది.
‣ పేపర్ 1: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు పేపర్ ఉంటుంది. గంటన్నరలో పూర్తి చేయాలి.
‣ పేపర్ 2: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్ట్పై 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. గంటలో పూర్తిచేయాలి.
‣ పేపర్ 3: జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అవేర్నెస్ అంశాలపై 120 ప్రశ్నలు ఇస్తారు. గంటన్నర సమయం ఉంటుంది.
‣ స్కిల్ టెస్ట్: స్టెనో పోస్టులకు దరఖాస్తు చేసినవారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. టైపింగ్, షార్ట్హ్యాండ్లో నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది.
ఎలా చదవాలి?
‣ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో ఉండవచ్చని ఒక అంచనా. అంటే అభ్యర్థులకు దాదాపు నాలుగు నెలల సమయం చిక్కుతుంది. దీన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి.
‣ ఈ పోస్టులను జనరల్, డిపో, టెక్నికల్, అకౌంట్స్గా విభజించుకుంటే... జనరల్, డిపో పోస్టులకు అప్లై చేసేవారు మ్యాథ్స్, ఇంగ్లిష్, రీజనింగ్, జీఎస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ మొదట చదువుకోవాలి. టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఈ సబ్జెక్టులకుతోడు అగ్రికల్చర్, ఫిజిక్స్ - కెమిస్ట్రీ, బోటనీ - జువాలజీ చదవాలి. అకౌంట్స్ పోస్టులకు చదివేవారు మొదట చెప్పిన సబ్జెక్టులతోపాటు అకౌంట్స్ సన్నద్ధం కావాలి.
‣ పోస్టు కోడ్ను అనుసరించి రాయాల్సిన పేపర్లు ఆధారపడి ఉండటం వల్ల మనం దరఖాస్తు చేస్తున్న పోస్ట్కు ఏయే ప్రశ్నపత్రాలు రాయాలి... వాటి సిలబస్ ఏంటి అనేది ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫేజ్ 1, ఫేజ్ 2 పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు పునరావృతం అవుతాయి. పరీక్షల్లో వాటికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆమేరకు సన్నద్ధం అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
‣ మొదట ఫేజ్ 1 దాటేలా ప్రిపేర్ కావడం మంచిదనేది నిపుణుల సలహా. ఇప్పటికే బ్యాంకింగ్, ఎస్ఎస్సీ వంటి పరీక్షలకు చదువుతున్న వారికి ఈ విభాగం సులభంగానే ఉంటుంది. కొత్తగా మొదలుపెట్టేవారు మరింత కసరత్తు చేయడం అవసరం.
‣ అనంతరం సంబంధిత సబ్జెక్ట్ను లోతుగా అధ్యయనం చేయాలి. ముందు సంవత్సరాల ప్రశ్నపత్రాలు చూడాలి. అనంతరం బిట్లు సాధన చేయడం వల్ల ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఆమేరకు చదవాలి.
పరీక్ష కేంద్రాలు
నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
‣ అభ్యర్థి ఏదైనా ఒక జోన్కే దరఖాస్తు చేయాలి. అలాగే ఒక విభాగానికే పోటీ పడాలి..
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://fci.gov.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!
‣ ఉజ్జ్వల భారత్ సాకారమే లక్ష్యంగా...
‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు