‣ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) విధానంలో 191 టెక్ పోస్టులకు ఇండియన్ ఆర్మీ ప్రకటన వెలువరించింది. బీటెక్ పూర్తిచేసుకున్నవారు వీటికోసం పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు!
ఎస్ఎస్సీ టెక్ మెన్, విమెన్ రెండు విభాగాల్లోనూ కలిపి మొత్తం 191 పోస్టులు ఉన్నాయి. వీటిలో మెన్కు 175, విమెన్కు 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. పురుషుల ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్ 49, కంప్యూటర్ సైన్స్ 42, ఎలక్ట్రికల్ 17, ఎలక్ట్రానిక్స్ 26, మెకానికల్ 32, ప్లాస్టిక్ టెక్/రిమోట్ సెన్సింగ్ 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి.. సివిల్ 3, కంప్యూటర్ సైన్స్ 5, ఎలక్ట్రికల్ 1, ఎలక్ట్రానిక్స్ 2, మెకానికల్ 3 కేటాయించారు. డిఫెన్స్ విడోల కోసం 2 ఖాళీలు ఉంచారు.
విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఖాళీలకు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తిచేసుకున్నవారూ అర్హులే. డిఫెన్స్ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులు.
వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 - ఏప్రిల్ 1, 2003 లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ (బీటెక్/ఎమ్మెస్సీ) మార్కుల ఆధారంగా షార్ట్లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో ఐదు రోజులు పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ.. వేతనాలు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2023 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్ కమిషన్) చేర్చుతారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగంలో మొదటి నెల నుంచి రూ.56,100 (లెవెల్ 10) మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. వివిధ ప్రోత్సాహకాలు పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు 24 మధ్యాహ్నం 3 వరకు
వెబ్సైట్: https://www.joinindianarmy.nic.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు
‣ ఇంటర్న్షిప్ చేసేముందు ఇవి చూసుకోండి!