‣ ఇంటర్మీడియట్ అనంతరం కోర్సులు, ఉద్యోగాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చదువుతోన్న కోర్సు ఎంపీసీ. ఇది పూర్తి చేసుకున్నవారి ముందు ఇంజినీరింగ్తోపాటు దీటైన ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి దాదాపు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఈ గ్రూపు సొంతం. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ... ఇలా విభిన్న కోర్సుల్లో చేరవచ్చు లేదా మేనేజ్మెంట్, టీచింగ్, లా, డిజైన్, అకౌంట్స్... తదితర కోర్సుల దిశగానూ అడుగులేయవచ్చు!
ఇంజినీరింగ్
ఎంపీసీ గ్రూపులో ఎక్కువ మంది విద్యార్థులు చేరడానికి ఇంజినీరింగ్ విద్యపై ఆసక్తే ప్రధాన కారణం. వీరిలో అధిక శాతం ఐఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఐఐటీ-జేఈఈ స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల రూపంలో అత్యుత్తమ అవకాశాలు, ఆకర్షణీయ వేతనాలు సొంతమవుతుండటంతో కెరియర్కు మలుపు తిప్పే కోర్సుగా బీటెక్ నిలుస్తోంది. ఇంటర్ అనంతరం నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులోనూ చేరే అవకాశం ఉంది. దీంతో అయిదేళ్లకే చదువు పూర్తై ఏడాది సమయం ఆదా అవుతుంది. కొన్ని ఐఐటీలతోపాటు పేరున్న ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ఈ తరహా కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థులు మాత్రం బీటెక్ చదవడానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచిల్లోనే చేరడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల నుంచి పలు సంస్థలు సీఎస్ఈలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బిగ్డేటా...తదితర కోర్సులు రూపొందించాయి. వీటిపై విద్యార్థుల్లో ఆదరణ పెరుగుతోంది. మిగిలినవారు ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచీల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆర్మీ, నేవీలు ఏటా రెండుసార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ విధానంలో ఎంపీసీ విద్యార్థులను ఎంపిక చేసి, బీటెక్ విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. జేఈఈ స్కోరు, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి. కోర్సు అనంతరం లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటున్నాయి. బీటెక్ అనంతరం ఎంఎస్ లేదా ఎంటెక్ ఆ తర్వాత పీహెచ్డీ కోర్సుల్లో చేరవచ్చు. సీఎస్ఐఆర్ నెట్తో బీటెక్ అర్హతతోనే స్టైపెండ్తో కూడిన ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ పూర్తిచేసుకోవచ్చు. పరిశోధన, బోధనలో భాగం కావాలనుకునేవాళ్లు ఈ తరహా చదువులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
బీటెక్ అనంతరం విదేశాల్లో ఎంఎస్ (పీజీ) కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. విదేశాల్లో అందుతోన్న ఆకర్షణీయమైన అవకాశాలే ఇందుకు కారణం. గేట్ స్కోరుతోనూ ఎన్నో ప్రభుత్వ అనుబంధ సంస్థలు పెద్ద మొత్తంలో వేతనాలు అందిస్తున్నాయి. బీటెక్ పూర్తిచేసుకున్నవారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్తో కేంద్రంలోని ముఖ్య విభాగాల్లో సేవలు అందించవచ్చు.
బీఫార్మసీ
ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ వైపు అడుగులేయవచ్చు. ఎంసెట్/ ఈఏపీసెట్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ వారికి చెరి సగం సీట్లు కేటాయిస్తారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత నేరుగా ఫార్మ్ డి కోర్సులోనూ చేరడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి.
బీఎస్సీ
ఎంపీసీ విద్యార్థులు బీటెక్ తర్వాత బీఎస్సీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీఎస్సీలో వైవిధ్యమైన కాంబినేషన్లు ఎంచుకునే అవకాశం ఇప్పుడుంది. ఆనర్స్ కోర్సులూ చదువుకోవచ్చు.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ అందించే మూడేళ్ల బీస్టాట్, బీమ్యాథ్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఆనర్స్ విధానంలో బీఎస్సీ కోర్సులు అందిస్తోంది. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్సులు అందిస్తోంది. బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ సంస్థలు అందించే కోర్సులు ఉపయోగపడతాయి. గత రెండుమూడేళ్ల నుంచి బీఎస్సీలోనూ డేటాసైన్స్, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్డేటా, ఫోరెన్సిక్ సైన్స్, యాక్చూరియల్ సైన్స్...మొదలైనవాటిని చేర్చారు. పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, డీమ్డ్ విద్యా సంస్థల్లో ఈ చదువులు అందిస్తున్నారు.
ఇతర దారులు...
ఎంపీసీ నేపథ్యంతో కాకుండా వేరే దారిలో వెళ్లాలని భావించేవారి కోసం వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్మెంట్ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు పలు సంస్థలు ఇంటిగ్రేటెడ్ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్తో ప్రముఖ న్యాయవిశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్, లిబరల్ స్టడీస్, ఫారిన్ లాంగ్వేజ్లు..ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
ఇంటిగ్రేటెడ్ విధానంలో పలు సంస్థలు యూజీ+ పీజీ కోర్సులు అందిస్తున్నాయి. దాదాపు ప్రతి ఐఐటీలోనూ ఏదో ఒక ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ సీట్లు జేఈఈ స్కోరుతో భర్తీ చేస్తారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే కోర్సులు పేరు గడించాయి. నెస్ట్తో నైసర్-భువనేశ్వర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఇలా ప్రవేశం పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్ పొందవచ్చు. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు రూపొందించాయి.
బీఎస్ - ఎంఎస్ కోర్సులు
ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్ పట్టా అందుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్ఈఆర్లు బీఎస్-ఎంఎస్ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ ఐఐటీ-జేఈఈ స్కోర్తో ప్రవేశాలు లభిస్తాయి. కేవీపీవైకు ఎంపికైనవారు నేరుగా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్డీవైపు దృష్టి సారించవచ్చు.
ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్
బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ విధానంలో చదువుకున్న వారికి ఏడాది సమయం ఆదా అవుతుంది. పేరొందిన సంస్థల్లో ఈ తరహా చదువులు లభిస్తున్నాయి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్ కోర్సు ఆరేళ్ల వ్యవధితో అందిస్తోంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ల్లో బీఎస్సీ బీఎడ్ కోర్సులు అందిస్తోంది. తేజ్పూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఏర్పడిన కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ బీఎస్సీ ఎడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీయూసెట్ యూజీలో చూపిన ప్రతిభతో కేంద్రీయ సంస్థల్లో సీటు పొందవచ్చు.
ఫ్యాషన్ టెక్నాలజీ
ఖర్చుకు వెనుకాడకుండా తమ ప్రత్యేకతను చాటుకోవాలని సమాజంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. దీంతో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి అవకాశాలు పెరుగుతున్నాయి. నిఫ్ట్లతోపాటు పలు సంస్థలు బీటెక్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువులను అందిస్తున్నాయి. నిఫ్ట్లు నిర్వహించే ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఫ్యాషన్ రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. వ్యవధి నాలుగేళ్లు. అనంతరం ఎంటెక్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. పీజీలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. పీజీ తర్వాత పరిశోధనల దిశగా అడుగులేయవచ్చు.
ఆర్కిటెక్చర్
ఇంజినీరింగ్లో ప్రత్యేక విభాగం ఆర్కిటెక్చర్. నిర్మాణాలు, కట్టడాల్లో సృజనాత్మకత చూపడానికి ఇష్టపడేవారు, డ్రాయింగ్ నైపుణ్యం ఉన్నవారు ఆర్కిటెక్చర్లో చేరవచ్చు. ఐఐటీ-జేఈఈలో మరో పేపర్ అదనంగా రాయడం వల్ల ఈ సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే నాటాతోనూ దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆర్కిటెక్చర్ చదువుల నిమిత్తం ప్రత్యేక సంస్థలు సైతం వెలిశాయి. ఉన్నత విద్యలో భాగంగా బీఆర్క్ తర్వాత ఎంఆర్క్ చదువుకోవచ్చు. అనంతరం పీహెచ్డీ పూర్తి చేసుకోవచ్చు. ఆర్కిటెక్టులకు దేశీయంగా, విదేశాల్లోనూ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
పైలట్
విమానయానం.. భవిష్యత్తులో వృద్ధి చెందడానికి అవకాశాలున్న రంగం. ఈ విభాగంలో పైలట్లదే పై చేయి. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివితేనే పైలట్ శిక్షణ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. దేశంలో పలు ప్రైవేటు సంస్థలు పైలట్ కోర్సు అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం తప్పనిసరి. యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ పరీక్షతో ఉచితంగా పైలట్ కోర్సు పూర్తిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఎంపికైనవారు ఒక వైపు బీటెక్ చదువుకుంటూనే పైలట్ శిక్షణ పొంది వాయుసేనలో సేవలు అందించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!