‣ 4500 ఖాళీలతో ఎస్ఎస్సీ ప్రకటన
ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొలువుదీరే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్)-2022 ప్రకటన వెలువడింది. పరీక్షల్లో ప్రతిభతో మెరిసినవారు వివిధ కేంద్ర శాఖల్లో.. ఎల్డీసీ/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. ఆకర్షణీయ వేతనంతో, చిన్న వయసులోనే సుస్థిర కెరియర్ సొంతం చేసుకోవచ్చు!
ఎస్ఎస్సీ దాదాపు ఏటా నిర్వహించే పరీక్షల్లో సీహెచ్ఎస్ఎల్ ఒకటి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారు దీన్ని లక్ష్యంగా చేసుకుని సన్నద్ధం కావచ్చు. బ్యాంకులు, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు రాస్తున్నవారు సీహెచ్ఎస్ఎల్ను ఎదుర్కోవచ్చు. కొద్ది మార్పులు తప్ప సిలబస్ ఇంచుమించు ఒకేలా ఉండటమే అందుకు కారణం. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడానికి నైపుణ్యమున్న మానవ వనరుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 4500 ఖాళీలు ఉన్నాయి. శాఖలు/ విభాగాలవారీ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, స్కిల్/టైప్ టెస్టులతో నియామకాలు చేపడతారు.
లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) ఉద్యోగాలకు లెవెల్ 2 మూలవేతనం రూ.19,900 అందుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు లెవెల్ 4 రూ.25,500 మూలవేతనం దక్కుతుంది. కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం లెవెల్ 5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఎ, ఇతర అలవెన్సులు మూలవేతనానికి అదనం. లెవెల్-2 ఉద్యోగాలకు సుమారు రూ.35 వేలు, లెవెల్-4కు ఇంచుమించు రూ.45 వేలు, లెవెల్-5 కొలువైతే రూ.55 వేల వేతనం పొందవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఇవి గొప్ప వేతనాలే. ఉద్యోగ భద్రత ఎక్కువ.
పరీక్ష ఇలా...
టైర్-1: పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పు జవాబుకు అర మార్కు తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఆంగ్ల భాషలో ప్రాథమిక స్థాయిలో 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్మెటిక్ స్కిల్) 25, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
టైర్-2: ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్లో 3 సెక్షన్లు ఉంటాయి. అన్ని సెక్షన్లలోనూ తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
‣ సెక్షన్ 1లో.. మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఒక్కో విభాగంలో 30 మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. 180 మార్కుల ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తి చేయాలి.
‣ సెక్షన్ 2లో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గంట వ్యవధిలో పూర్తి చేయాలి.
‣ సెక్షన్ 3లో.. కంప్యూటర్ పరిజ్ఞానంపై 15 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటాయి. వ్యవధి 15 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. సెక్షన్ 3 రెండో సెషన్లో.. స్కిల్/ టైప్ టెస్టు నిర్వహిస్తారు.
డేటా ఎంట్రీ పోస్టులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్టు ఉంటుంది. ఎల్డీసీ/జేఎస్ఏ పోస్టులకు 10 నిమిషాల వ్యవధిలో టైప్ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ పోస్టులకు కంప్యూటర్పై 15 నిమిషాలకు 2000-2200 కీ డిప్రిషన్స్ ఇవ్వాలి. ఏదైనా అంశంలో ముద్రించిన సమాచార పత్రం ఇచ్చి దాన్ని కంప్యూటర్లో పొందుపర్చమంటారు. టైప్ టెస్టులో భాగంగా ఇంగ్లిష్ లేదా హిందీ ఎంచుకోవచ్చు. ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆంగ్లంలో అయితే 1750, హిందీలో 1500 కీ డిప్రెషన్స్ ఇవ్వగలగాలి.
టైర్ 1లో అర్హత సాధిస్తేనే టైర్ 2కి అనుమతిస్తారు. ఈ రెండు దశల్లోనూ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈబీసీలు 25, మిగిలిన విభాగాలవారు 20 శాతం చొప్పున ప్రతి సెక్షన్లోనూ మార్కులు పొందితేనే అర్హులవుతారు. కంప్యూటర్ అవేర్నెస్, స్కిల్/ టైప్ టెస్టులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. తుది నియామకాలు టైర్ 2 మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి.
ప్రశ్నలు ఏ అంశాల్లో?
‣ జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, కాంప్రహెన్షన్..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 8,9,10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయాలి.
‣ జనరల్ ఇంటలిజెన్స్: ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలుంటాయి. సెమాంటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్-డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి అడుగుతారు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. ఎక్కువ మార్కులు పొందవచ్చు.
‣ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అరిథ్మెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి, స్టాటిస్టికల్ చార్ట్స్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్మెటిక్ ఆపరేషన్స్లో భాగంగా.. శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, డిస్కౌంట్.. మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకున్నవే. అందువల్ల గణితం పుస్తంలోని ఈ విభాగాలను బాగా అభ్యాసం చేయాలి. ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకుని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ స్కోరు సాధ్యమే.
‣ జనరల్ అవేర్నెస్: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సమాధానాలు గుర్తించగలరు. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల కోసం 2022 ఏప్రిల్ నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవచ్చు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
టైర్-2: ఇందులోనూ టైర్-1 అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అయితే వాటి స్థాయి ఎక్కువ. అందువల్ల లోతైన అధ్యయనం తప్పనిసరి. ఇందులో అదనంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చేర్చారు. కంప్యూటర్ ప్రాథమికాంశాలు, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తేలికపాటి ప్రశ్నలే వస్తాయి. వీటికి ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల కంప్యూటర్ సైన్స్ పుస్తకాల్లో ముఖ్యాంశాలు చదివితేచాలు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో అర్హత సాధిస్తే సరిపోతుంది.
ఇవీ మార్పులు..
సీహెచ్ఎస్ఎల్ పరీక్షలో గతంతో పోలిస్తే టైర్ 2లో మార్పులు చేశారు. లెటర్ రైటింగ్, ఎస్సే/అప్లికేషన్ రైటింగ్ స్థానంలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష టైర్ 1కి కొనసాగింపుగా ఉంటుంది. అదనంగా కంప్యూటర్ అవేర్నెస్ విభాగాన్నీ చేర్చారు. ఆంగ్లంలో వ్యాసాలు/ఉత్తరాలు రాయడానికి ఇబ్బంది పడేవారికి ఈ మార్పు సానుకూలాంశమే.
ఇదీ దారి
1. ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాల నుంచే వస్తాయి. అందువల్ల ముందు వాటిపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
2. పరిమిత పుస్తకాలనే ఎంచుకోవాలి. వాటినే బాగా చదవాలి.
3. గత ప్రశ్నపత్రాలు గమనించాలి. ఏ అంశాల్లో, ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, అందుకు తగ్గ సన్నద్ధత ఉండేలా చూసుకోవాలి.
4. నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్కూ ప్రాధాన్యమివ్వాలి. అందులోని అంశాలే సాధన చేయాలి. ఆ పరిధి దాటి ప్రశ్నలు అడగరు.
5. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి. జవాబులను సరిచూసుకుని వెనుకబడిన విభాగాలకు అదనపు సమయం కేటాయించుకోవాలి. టైర్-1లో అరవై నిమిషాల్లో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయమే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ల్లో పలు ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. సెక్షన్లవారీ సమయాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించి మిగిలిన వ్యవధిని కష్టమైన వాటికి వెచ్చించాలి.
6. మాదిరి ప్రశ్నలు ఎక్కువ సాధన చేస్తే వ్యవధిలోగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించవచ్చు. కొన్నింటికి జవాబు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. వాటిని ఆఖరులో, సమయం ఉంటేనే ప్రయత్నించాలి.
7. రుణాత్మక మార్కులున్నందున అసలేమాత్రం తెలియని, అవగాహన లేని ప్రశ్నలను వదిలేయాలి.
గమనించండి!
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనవరి 1, 2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 4, 2023
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు
టైర్-1 పరీక్షలు: ఫిబ్రవరి, మార్చిల్లో నిర్వహిస్తారు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
టైర్-2 పరీక్ష: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
వెబ్సైట్: https://ssc.nic.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్ 6 సిగ్మా