‣ సీడీఎస్ఈ 2022(1) ప్రకటన విడుదల
దేశ రక్షణలో నేను సైతం.. అంటూ ముందుకొచ్చేవారికి ఎన్నో అవకాశాలున్నాయి. అలాంటి వాటిలో యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ముఖ్యమైంది. రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలకు ఈ పరీక్ష దారి చూపుతుంది. డిగ్రీ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టుల్లోకి మహిళలకూ అవకాశం ఉంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో సీడీఎస్ఈ 2022(1) పూర్తి వివరాలు చూద్దాం!
రక్షణ రంగంలో మేటి ఉద్యోగాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వీటిలో డిగ్రీ అర్హతతో నిర్వహించే సీడీఎస్ఈ ముఖ్యమైంది. ఏడాదికి రెండుసార్లు ఈ ప్రకటన వెలువడుతుంది. ఒక్కో దఫాలో సుమారు రెండు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. పరీక్ష స్థాయి మధ్యస్థంగా ఉంటుంది. అందువల్ల ముందు నుంచి సన్నద్ధమైతే తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవచ్చు.
రాత పరీక్షతో సమాన ప్రాధాన్యం ఇంటర్వ్యూకి ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటి 300 మార్కులకు ఉంటాయి. ఇంటర్వ్యూలో అయిదు రోజులపాటు వివిధ కోణాల్లో అభ్యర్థిని నిశితంగా గమనిస్తారు. పలు పరీక్షల ద్వారా వీరిని వడపోస్తారు. ఇలా అన్నింటా నెగ్గినవారినే శిక్షణలోకి తీసుకుని సానబెడతారు. వీరు తమ ప్రాధాన్యం, మెరిట్ అనుసరించి ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్ల్లో సేవలు అందించవచ్చు. ఏర్ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్లో మెరుగైన ప్రతిభ చూపినవారు ఫైటర్ పైలట్గానూ రాణించవచ్చు. సీడీఎస్ఈతో త్రివిధ దళాల్లో ఏ సర్వీస్కి ఎంపికైనప్పటికీ సివిల్ సర్వెంట్లతో సమాన మూల వేతనం (లెవెల్ 10 పే) అందుకోవచ్చు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఏర్Âఫోర్స్లకు ఉన్నతాధికారి కావచ్చు.
పరీక్షలో...

ప్రశ్నలడిగే విభాగాలు
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. అరిథ్మెటిక్ (నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అంశాల నుంచి వీటిని అడుగుతారు.
ఇంగ్లిష్: అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. కాంప్రహెన్షన్, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజె పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్పెలింగ్ మిస్టేక్స్, సెంటెన్స్ ట్రాన్ఫర్మేషన్, రిపోర్టెడ్ స్పీచ్ల నుంచి ప్రశ్నలు సంధిస్తారు.
జనరల్ నాలెడ్జ్: దైనందిన జీవితానికి ముడిపడిన ప్రశ్నలు సంధిస్తారు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపైనా కొన్ని ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూ
ఇందులో రెండు దశలుంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో దశలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఇవి కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాలను పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ
అభ్యర్థి ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ అందిస్తారు. ఏర్Âఫోర్స్ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ నిర్వహిస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు చెన్నైలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఓటీఏ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మద్రాస్ విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
ఉద్యోగంలో...
ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఏర్ఫోర్స్లో ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టిక్నికల్/ నాన్ టెక్నికల్) ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) ఉన్న ఉద్యోగాలే. రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలు .. అన్నీ కలుపుకుని సుమారు రూ.లక్ష వేతనం పొందవచ్చు. రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఏర్ఫోర్స్లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లు విధుల్లో కొనసాగినవారు సంబంధిత దళాల్లో మేజర్/ లెఫ్టినెంట్ కమాండర్/ స్క్వాడ్రన్ లీడర్ గుర్తింపు పొందవచ్చు. 13 ఏళ్ల సేవలతో ఏర్ఫోర్సులో వింగ్ కమాండర్ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా అందుకోవచ్చు.
రాణించాలంటే...
‣ అభ్యర్థులు సీడీఎస్ఈ గత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్లో వీటిని సమాధానాలతో సహా అందుబాటులో ఉంచారు. ప్రశ్నపత్రంపై ఒక ప్రాథమిక అంచనాకు రావడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆయా సబ్జెక్టులు/ విభాగాల వారీ ఏయే అంశాల్లో దృష్టి సారించాలో తెలుస్తుంది.
‣ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ పేపర్ను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయుల్లో గణిత నేపథ్యం ఉన్నవారు సులువుగానే ఎదుర్కోవచ్చు. సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులు ముందుగా ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. వీరు అదనపు సమయం కేటాయించుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా ఈ విభాగంలో ఆశించిన మార్కులు పొందగలరు. ముందుగా సిలబస్లో పేర్కొన్న అధ్యాయాల కోసం 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి.
‣ జనరల్ నాలెడ్జ్ పేపర్కు సంబంధించి... భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాల్లో సమాచారం ఉపయోగపడుతుంది. లూసెంట్ లేదా అరిహంత్ జీకే పుస్తకాల్లో ఏదో ఒకటి చదువుకున్నా సరిపోతుంది. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. వర్తమాన అంశాలు, తాజా అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలు..తదితరాల నిమిత్తం ఏదైనా దినపత్రికను అనుసరించాలి. ముఖ్యాంశాలు నోట్సుగా రాసుకోవాలి.
‣ ఇంగ్లిష్ విభాగం ప్రశ్నలన్నీ హైస్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి. ఆంగ్లంపై పట్టు లేనివారు జనరల్ ఇంగ్లిష్ (పియర్సన్/ టాటా మెక్గ్రా హిల్స్) పుస్తకంలోని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు.
‣ పరీక్షకు ముందు వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం తప్పనిసరి. ఇలా చేసినప్పుడు సమయపాలనను విధిగా పాటించాలి. ఏ అంశాలు/విభాగాల్లో తప్పులు చేస్తున్నారో గమనించి, వాటికి తుది సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.
కటాఫ్ ఇలా..
2020 సీడీఎస్ఈ 1, 2 తుది ఫలితాలు గమినిస్తే పరీక్షలో 50 శాతం మార్కులు సాధించినవారు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి ఎంపికవుతున్నారు. అలాగే పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ కలిపి 50 శాతం మార్కులు పొందితే ఏర్ఫోర్స్లో అవకాశం పొందవచ్చు. 45 శాతం మార్కులతో మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో కాలు మోపవచ్చు.
విద్యార్హత
మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఏర్ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ పోస్టులకు మహిళలూ అర్హులే. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీ ఖాళీలకు జనవరి 2, 1999 తర్వాత; జనవరి 1, 2004 కంటే ముందు జన్మించినవారు అర్హులు. ఏర్ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 తర్వాత; జనవరి 1, 2003 కంటే ముందు జన్మించాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1998 తర్వాత, జులై 1, 2004 కంటే ముందు జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 341. విభాగాల వారీ ఐఎంఏ-100, ఐఎన్ఏ-22, ఏఎఫ్ఏ-32, ఓటీఏ-187(వీటిలో 170 పురుషులకు, 17 మహిళలకు కేటాయించారు)
ఆన్లైన్ దరఖాస్తులు: జనవరి 11 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 10
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
వెబ్సైట్: https://upsc.gov.in/
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సరైన శరీర భాషతో ఉద్యోగ విజయం!
‣ తీరదళంలో నావిక్....యాంత్రిక్!
‣ ఏకాగ్రతతో ప్రిపరేషన్కు కొన్ని మెలకువలు