Post your question

 

    Asked By: దీపిక

    Ans:

    ఎంబ్రియాలజిస్టులు పునరుత్పత్తి అంచనాలు, సంతానోత్పత్తి పరిశోధన, సంతానోత్పత్తి పద్ధతుల అధ్యయనంపై దృష్టి పెడతారు. ముఖ్యంగా పిండ సంరక్షణలో నైపుణ్యంతోపాటు పునరుత్పత్తి సమస్యల చికిత్సకు నూతన ఆవిష్కరణలు చేస్తారు. గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉన్న రోగులకు కౌన్సెలింగ్, చికిత్సలో వైద్యులతో కలిసి పని చేస్తారు. ఎంబ్రియాలజిస్ట్‌ అవ్వాలంటే క్లినికల్‌ లాబొరేటరీ పద్ధతులపై లోతైన జ్ఞానం, పునరుత్పత్తి శాస్త్రంపై అవగాహన అవసరం. ఈ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు బీఎస్సీలో బయొలాజికల్‌ సైన్స్‌/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ చదవాలి. బీఎస్సీ తరువాత ఎంబ్రియాలజిలో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఈ కోర్సులు అందుబాటులో లేకపోతే ఎమ్మెస్సీలో మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ లాంటి కోర్సులు చేసి, ఎంబ్రియాలజీ సంబంధిత క్లినికల్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసి, ఆ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోండి. మనదేశంలో ఎంబ్రియాలజీ రంగంలో ఉన్నత విద్యకు అవకాశాలు ఎక్కువగా లేవు. మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ /యానిమల్‌  బయాలజీ / రిప్రొడక్టివ్‌ బయాలజీల్లో ఎంబ్రియాలజీకి సంబంధించిన అంశాల్లో  పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌ కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మీకు ఆసక్తి ఉంటే విదేశాల్లోనే పీజీ, పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. ఎంబ్రియాలజీ కోర్సులు చదివినవారికి సంతాన సాఫల్య కేంద్రాల్లో, క్లినికల్‌ లాబొరేటరీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌.విజయ్‌శంకర్‌

    Ans:

    మీరు బీఏలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. పీజీలో ఏ సబ్జెక్టు చదవాలనుకొంటున్నారు? ‘లా’ కోర్సులో చేరేది ఎందుకోసం? పది సంవత్సరాల తరువాత మీరు ఏ స్థాయిలో ఉండాలనుకొంటున్నారు? మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక కెరియర్‌ ఆశయాలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నాలు చేయండి. మీరు ‘లా’ రెగ్యులర్‌గా చదువుతూ, పీజీ కోర్సును దూరవిద్యలో చేయొచ్చు కానీ, దానివల్ల మీకు ఏం ఉపయోగం అనేది కూడా ఆలోచించండి. ‘లా’ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరినప్పుడు వేరేవి చదవకుండా, న్యాయవిద్య మీదే శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు చదవాలనుకొంటున్న పీజీ కోర్సు, భవిష్యత్తులో మీ న్యాయవాద వృత్తికి ఉపయోగమని భావిస్తే పీజీ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది న్యాయవాదులు పీజీ చేయకుండానే బీఏ/ బీకాం/ బీఎస్సీతో పాటు ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ మాత్రమే చదివి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారని గుర్తించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: ఎం.అజయ్‌ కుమార్‌

    Ans:

    తెలుగు నుంచి ఇంగ్లిషుకు, ఇంగ్లిషునుంచి తెలుగుకు అనువాదాలు చేసే ఉద్యోగ, వ్యాపార సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ అనువాదాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత కూడా తక్కువే! కనీసం రెండు భాషల్లో ప్రావీణ్యం ఉండి, వాటి వ్యాకరణంపై మంచి పట్టువుండి, సృజనాత్మకత, అనువాదాలపై ఆసక్తి ఉంటే అనువాదాలు చేయటం కష్టమేమీ కాదు. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అనుభవం పెరిగేకొద్దీ మెలకువలు పెంపొందించుకోవచ్చు.
    ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే గూగుల్‌ ట్రాన్స్‌లేషన్, ఇతర ఆన్‌లైన్‌ ట్రాన్సలేషన్‌ సేవలు అందుబాటులో లేని సమయాల్లో అనువాదకులకు చాలా డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వ సంస్థల్లో అనువాదకులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.  అనువాదంలో నైపుణ్యం ఉన్నవారికి అడ్వర్‌టైజింగ్‌ రంగంలో, పత్రికా, సాహిత్య రంగాల్లో, లీగల్‌ పరంగా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. మీకు ఈ రంగంలో చదవాలనే ఆసక్తి ఉంటే ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. కానీ, ఈ అవకాశాలు కూడా పరిమిత విద్యాసంస్థల్లోనే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: నరసింహారావు

    Ans:

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యాలను సాధించగల సామర్థ్యం ద్వారా మాత్రమే విజయాన్ని కొలుస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, జీవితంలో ఎదుగుదల కోసం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంటే వ్యక్తిత్వాన్ని రూపొందించే నైపుణ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి పెట్టడం. ఇతరుల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తూ స్వీయ అవగాహన పొందే మెలకువలను ఎవరికి వారే స్వయంగా నేర్చుకోవడంలో వ్యక్తిత్వ వికాస కోచ్‌ సహాయపడతారు. అందుకు అవసరమైన వ్యూహాలను ప్రయోగిస్తారు. వ్యక్తి సామాజిక నైపుణ్యాలు, ఉత్పాదకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, పాజిటివ్‌ థింకింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెంపొందించడంపై దృష్టి పెడతారు. అదేసమయంలో లక్ష్యాలను నిర్దేశించుకోడానికీ, వాటి సాధనకూ మార్గదర్శకాలను అందిస్తారు. వ్యక్తుల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ఇబ్బందులు గుర్తించడంలో సహాయపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవిత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై సలహాలు ఇస్తారు.
    కోచ్‌గా రాణించాలంటే ఈ రంగంపై విపరీతమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, సహానుభూతి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఎంతో ఓపిక, దృఢమైన వ్యక్తిత్వం అవసరం. ముందుగా సైకాలజీ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, స్వీయ చరిత్రలు చదవండి. వీలుంటే సైకాలజీలో పీజీ చేయండి. కౌన్సెలింగ్‌ సైకాలజీలో డిప్లొమా కూడా చేయండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఆన్‌  లైన్‌లో చేయండి. సంబంధిత కోచ్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరి ఈ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకొని, విశ్వసనీయత గల సంస్థ నుంచి సర్టిఫికేషన్‌ పొందే  ప్రయత్నం చేయండి. సరైన నైపుణ్యాలు లేకుండా ఈ రంగంలో ప్రవేశించకూడదని మర్చిపోవద్దు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: దుర్వ బిల్లా

    Ans:

    సాధారణంగా ఎవరైనా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేస్తే, అందులో కచ్చితంగా ఒకటి దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చేసి ఉంటారు. కానీ, మీరు రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో, రెండు వేర్వేరు రాష్ట్రాలనుంచి చేశారు. ఇది ఎలా సాధ్యం అయింది? ఈ రెండు డిగ్రీల్లో మీరు ఏ డిగ్రీని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి, నిర్దేశిత హాజరుతో పూర్తిచేశారు? ఒకే సమయంలో రెండు డిగ్రీలు, రెండు రాష్ట్రాల్లో చేసినట్లు మీరు దరఖాస్తులో రాస్తే, ఆ విషయం మీ ఉద్యోగావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకని మీరు నిజాయతీగా చేసిన డిగ్రీతో మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రెండో డిగ్రీ విషయం పూర్తిగా మర్చిపోండి. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కానీ మీరు డిగ్రీలు చదువుతున్న రెండు కళాశాలల పని సమయాలు వేర్వేరుగా ఉండాలి. రెండు కళాశాలల్లో కూడా నిర్దేశిత హాజరు శాతం కచ్చితంగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే, యూజీసీ నిబంధనలను పాటిస్తూ మీ ఉద్యోగ ప్రయత్నాలు/ఉన్నత విద్యను కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అపర్ణ

    Ans:

    విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో డిజైన్‌-సిరామిక్స్‌ అండ్‌ గ్లాస్, డిజైన్‌-టెక్స్‌టైల్, గ్రాఫిక్‌ ఆర్ట్‌ (ప్రింట్‌ మేకింగ్‌), హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్‌ స్పెషలైజేషన్లు ఉంటాయి. అక్కడ చదవాలంటే ముందుగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే దేశవ్యాప్త ప్రవేశపరీక్ష రాయాలి. దానిలో మెరుగైన ర్యాంకు సాధించి, విశ్వభారతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించే ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ పరీక్షకు హాజరు అవ్వాలి.
    ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్‌ రెండు గంటల వ్యవధిలో ఉంటుంది. వైవా వోస్‌ పరీక్షకు వెళ్ళేప్పుడు విద్యార్ధులు గతంలో వేసిన చిత్రాలు/ పెయింటింగ్‌లు/ చెక్కిన శిల్పాలు/ తీసిన డాక్యుమెంటరీలు తీసుకొని వెళ్ళాలి. ఎన్టీఏ పరీక్షలో వచ్చిన మార్కులకు ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు చేపడతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: విక్రమ్‌

    Ans:

    క్రీడల కోచ్‌ అవ్వాలంటే వాటిలో ఛాంపియన్‌ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ క్రీడలపై విపరీతమైన ఆసక్తి, కనీసం రెండిట్లో ప్రవేశం, ఈ రంగాన్ని కెరియర్‌గా మార్చుకోవాలనే లక్ష్యం, క్రీడలతోనే జీవితకాలం గడపగలిగే బలమైన కోరిక అవసరం. ఇవన్నీ ఉంటే స్పోర్ట్స్‌ కోచ్‌ అవటం పెద్ద కష్టమేమీ కాదు. నాయకత్వ లక్షణాలు, శారీరక దార్ఢ్యం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ప్రేరణ సామర్ధ్యం, ఓపిక, సహానుభూతి, బలమైన వ్యక్తిత్వం.. వీటితో పాటు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్‌ / డిప్లొమా / గ్రాడ్యుయేషన్‌ / పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌/ పీహెచ్‌డీ ఉన్నట్లైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీరు ఏ క్రీడలో శిక్షకునిగా స్థిరపడాలనుకుంటున్నారో దానిపై స్పష్టత అవసరం. ఆ క్రీడలో పేరుపొందిన కోచ్‌ దగ్గర కొంతకాలం శిక్షణ తీసుకోవాలి. తర్వాత ఏదైనా స్టేడియంలో గానీ, అకాడమీలో గానీ, విద్యాసంస్థలో గానీ కోచ్‌గా కెరియర్‌ ప్రారంభించవచ్చు. ఇటీవల కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు / సంస్థలు స్పోర్ట్స్‌ కోచింగ్‌లో సర్టిఫికెట్‌ / డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని కోర్సులో చేరే నిర్ణయాన్ని తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.ప్రియ

    Ans:

    మీరు బోధనపై ఆసక్తితో ఆ రంగంలోకి రావాలి కానీ వేరే ఉద్యోగంపై ఉన్న అసంతృప్తితో కాదు. దానివల్ల మీరూ, మీ దగ్గర చదువుకొనే విద్యార్థులూ సంతృప్తిగా ఉండలేరు. బోధన రంగంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది అవకాశాలకూ పోటీ ఎక్కువ. ఇక ప్రైవేటు కళాశాలల విషయానికొస్తే, వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. మీరు హాస్పిటల్లో పనిచేస్తే భవిష్యత్తులో మీ ప్రతిభకు తగ్గ వేతనాలు లభించే అవకాశం ఉంటుంది. కానీ బోధన రంగంలో ప్రతిభకు తగ్గ వేతనాలు, పదోన్నతులు ఆకర్షణీయంగా ఉండవు. ప్రైవేటు కళాశాలల్లో ఎంఎల్‌టీ కోర్సుల్లో అడ్మిషన్ల సమస్య ఉంది. అడ్మిషన్లు ఉన్న కళాశాలల్లో హాజరు సమస్య ఉంది. హాజరు ఉన్నచోట కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఉద్యోగ సంతృప్తి దొరకడం చాలా కష్టం. మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రకరకాల పేషంట్లను చూస్తూ ఉన్నట్టే కళాశాలలో బోధించేప్పుడు రకరకాల మనస్తత్వాలున్న విద్యార్థుల్ని చూస్తారు. భిన్న సామర్థ్యాలుండే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించటం పెద్ద సవాలే. కానీ మీకు బోధన రంగంపై విపరీతమైన ఆసక్తీ, సంబంధిత నైపుణ్యాలూ ఉంటే, బోధన ద్వారా ఎదుటి వారి జీవితాల్ని మార్చాలనే ఆసక్తి బలంగా ఉంటే నిరభ్యంతరంగా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌.రవిశంకర్‌

    Ans:

    మీరు బీబీఏ రెగ్యులర్‌గా చేస్తున్నారా, ఓపెన్‌/ డిస్టెన్స్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేస్తున్నారా అనేది చెప్పలేదు. ఒకవేళ మీరు బీబీఏ రెగ్యులర్‌గా ఏదైనా బిజినెస్‌ స్కూల్లో చదువుతూ ఉంటే, మీకున్న పని అనుభవంతో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీరు బీబీఏలో ఏ స్పెషలైజేషన్‌ తీసుకున్నారో కూడా చెప్పలేదు. మీరింకా బీబీఏ స్పెషలైజేషన్‌ గురించి నిర్ణయం తీసుకోకపోతే ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ / సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ గురించి ఆలోచించండి.
    ఎంబీఏ విషయానికొస్తే-  క్యాట్‌ రాసి ఐఐఎం లాంటి ప్రముఖ విద్యాసంస్థలనుంచి రెగ్యులర్‌ ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్‌ ఎంబీఏ చేసే అవకాశం లేకపోతే మంచి బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేయొచ్చు. ఆపరేషన్స్, మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో మీకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబీఏలో ఆపరేషన్స్‌/ లాజిస్టిక్స్‌/ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్‌లను చదివే ప్రయత్నం చేయండి. రెండో స్పెషలైజేషన్‌గా బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ చదివితే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయిప్రకాశ్‌

    Ans:

    సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ల్లో రెండు వేర్వేరు పీజీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. సోషల్‌ వర్క్‌లో పీజీ చేయాలంటే ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌),  సోషియాలజీలో పీజీ చేయాలంటే ఎంఏ సోషియాలజీ చదవాలి. సాధారణంగా సోషియాలజీ ప్రోగ్రామ్‌లో సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ గురించి ఉంటుంది. సామాజిక సంబంధాలు, సామాజిక ఆలోచనా విధానం, సంస్కృతి, అభివృద్ధి సామాజిక కోణం, కులం, మతం, పట్టణీకరణ, వలసలు, వివాహం, కుటుంబం, సామాజిక పరిశోధన లాంటి అంశాలుంటాయి. ఇక సోషల్‌ వర్క్‌ విషయానికొస్తే- కమ్యూనిటీ వర్క్, చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్, లేబర్‌ వెల్ఫేర్, అంటరానితనం, పునరావాసం, గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ లాంటి అంశాలు భాగం. సోషియాలజీలో పీజీ చేసినవారు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, సోషల్‌ వర్కర్లుగా స్థిరపడవచ్చు. సోషల్‌ వర్క్‌లో పీజీ చేసినవారు సోషల్‌ వర్కర్, ఫామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీఅడిక్షన్‌ కౌన్సెలర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌