• facebook
  • whatsapp
  • telegram

అమెరికా కంటే ఎక్కువగా కెన‌డాకు మన విద్యార్థులు  

* పర్మినెంట్‌ రెసిడెంట్‌ హోదా సులభమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: విదేశీ చదువులకు భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం ఏది? అని అడిగితే అమెరికా అని ఠక్కున సమాధానం ఇవ్వకండి. ఇప్పుడు ఆ స్థానాన్ని కెనడా ఆక్రమించింది మరి.. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు అదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకూ అమెరికాలో భారతీయ విద్యార్థులు 2,11,930 మంది ఉండగా.. కెనడాలో ఆ సంఖ్య 2,15,720గా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది భారతీయులు చదువుకుంటున్నారు.

ఎందుకీ మార్పు..?

విదేశీ చదువంటే అమెరికానే అనే భావన నుంచి భారతీయ విద్యార్థులు బయటపడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వాస్తవానికి అమెరికాలో చైనా తర్వాత అత్యధిక మంది విదేశీ విద్యార్థులు మనవారే. ఆ దేశానికి 2017లో అధ్యక్షుడిగా ట్రంప్‌ రావడంతోనే భారతీయ విద్యార్థుల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. మన దేశ విద్యార్థులపై అక్కడి పోలీసుల నిఘా, వీసాల జారీ కఠినతరం చేయడం, హెచ్‌1బీ వీసాలు లాంటి వాటిల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు చేయడం తదితర కారణాలతో విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల వైపు మొగ్గుచూపారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా ఆ దేశాలు భారత్‌పై దృష్టి పెట్టాయి. కెనడా అయితే వీసాల జారీని సులభతరం చేసింది. ఒక్క ఏడాది కోర్సుకు కూడా రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఇస్తోంది. రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్లపాటు వర్క్‌ పర్మిట్‌ జారీ చేస్తున్నారు. ఆ దేశంలో శాశ్వత స్థిర నివాసం(పర్మినెంట్‌ రెసిడెంట్‌) కోసం దరఖాస్తు చేసుకున్న రెండు, మూడేళ్లలోనే వస్తోంది. ఆ అనుభవంతో సిటిజన్‌షిప్‌( ఆ దేశ పౌరసత్వం) కోసం దరఖాస్తు చేసుకుంటే అయిదేళ్లలో ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో లక్ష వీసాలిచ్చామని దిల్లీలోని కెనడా హైకమిషన్‌ తెలిపింది.

కెనడా వైపు చూస్తున్నారు

బ్రిటన్‌ తరహాలోనే కెనడాలోనూ ఒక్క ఏడాదిలో మాస్టర్‌ విద్య పూర్తిచేసి రెండేళ్లపాటు కొలువు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెరికా కంటే 30 శాతం వరకు ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉంటాయి. గుజరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి చాలా మంది డిప్లొమా కోర్సులు చేయడానికి కూడా వెళ్తున్నారు. టూరిజం, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఎక్కువగా చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గత మూడు నాలుగేళ్ల నుంచి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈసారి వీసాలు ఇస్తున్నా.. ట్రావెల్‌ నిషేధం మరికొద్ది రోజులపాటు ఉండనుంది. త్వరలోనే దాన్ని తొలగించే అవకాశం ఉంది.

- వేములపాటి అజయ్‌కుమార్‌, సంచాలకుడు, ఐఎంఎఫ్‌ఎస్‌ కన్సల్టెన్సీ

Posted Date : 27-07-2021


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం