ఈనాడు, హైదరాబాద్: ఈసారి ముందుగా ఎంసెట్ అగ్రికల్చర్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. జులై 5, 6 తేదీల్లో ఇంటర్ బైపీసీ విద్యార్థుల కోసం నిర్వహించే అగ్రికల్చర్ విభాగం పరీక్షలు జరుపుతారు. ఆ తర్వాత జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి గత ఫిబ్రవరిలోనే వెల్లడించింది. అయితే ఏ విభాగం పరీక్షలు ముందుగా జరుపుతారు? దేనికి ఎన్ని రోజులన్నది స్పష్టత ఇవ్వలేదు. ఎంసెట్ కమిటీ తొలి సమావేశం ఫిబ్రవరి 06న జరగనున్నందున ఆయా అంశాలపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. జులై 3న జేఈఈ అడ్వాన్స్డ్ ఉన్నందున ఆ పరీక్షకు, ఎంసెట్కు కొంత వ్యవధి ఉండాలని భావించిన అధికారులు ముందు అగ్రికల్చర్ పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. జేఈఈ మెయిన్లో 90 ప్రశ్నలు ఇచ్చి 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలనే మాదిరిగా ఎంసెట్లో ప్రత్యేకంగా ఛాయిస్ ఉండదు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం, ద్వితీయ ఇంటర్లో 70 శాతం సిలబస్నే పరిగణనలోకి తీసుకుంటున్నందున ప్రశ్నల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఎంసెట్ పరీక్షలు గత ఏడాది మాదిరిగా ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు జరుపుతారు. ఎంసెట్కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్టికెట్ సంఖ్య అవసరం. ఈ క్రమంలో మార్చి 20 తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.