తప్పులు సవరించుకుంటూ అభ్యసించా: ఏపీ ఎంసెట్ మెడికల్లో 4వ ర్యాంకర్ సమీహానారెడ్డి గజ్జల
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: నాకు ఎంసెట్లో నాలుగో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. రోజుకి 10-11 గంటలపాటు కష్టపడి చదివాను. భౌతిక, రసాయన శాస్త్రాల అంశాలపై ఎక్కువగా దృష్టి సారించి పలుమార్లు అభ్యాసం చేశాను. ఒకటికి రెండుసార్లు తప్పులు సవరించుకుంటూ ప్రణాళిక ప్రకారం పరీక్షకు సిద్ధమయ్యా. అధ్యాపకులు అన్ని సబ్జెక్టులపై మెలకువలు నేర్పించారు. మేము కేపీహెచ్బీలో ఉంటున్నాం. అమ్మనాన్న ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ప్రోత్సహించారు. నాన్న కరుణాకర్రెడ్డి విశ్రాంత సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమ్మ ఫణీజ ఆర్అండ్బీలో ఇంజినీర్. దిల్లీ ఎయిమ్స్లో సీటు వస్తుందనుకుంటున్నా.
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నా: లహరి, ఏపీ ఈఏపీ సెట్ 5వ ర్యాంకర్
నిజాంపేట, న్యూస్టుడే: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపైనే దృష్టి సారించడంతోనే నేను ఈ ఫలితం సాధించా. మాది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి. అమ్మానాన్న శివశంకర్, రత్న నగరంలోని ప్రగతినగర్లో స్థిరపడ్డారు. నాన్న ఫార్మా సంస్థలో మేనేజర్. అమ్మ గృహిణి. కూకట్పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ పూర్తిచేశా. వైద్యశాస్త్రం అంటే నాకు మక్కువ, యూరాలజీ వైద్యురాలిని కావాలనేది నా జీవితాశయం.
ఏ రోజుకారోజు పునశ్చరణ
కళాశాలలో బోధించిన పాఠ్యాంశాలను ఏ రోజుకారోజు పునశ్చరణ చేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు. సబ్జెక్టుకు గంట చొప్పున చదువుకునేదాన్ని.. అది కూడా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మాత్రమే పునశ్చరణ చేసుకున్నా.