• facebook
  • whatsapp
  • telegram

Education: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 18 నుంచి పునశ్చరణ తరగతులు

‣ పునశ్చరణ తరగతులపై పలువురు విమర్శలు


ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆ శాఖే ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని ఇటీవల ప్రైవేటు కళాశాలలను హెచ్చరించగా.. ప్రభుత్వ కళాశాలల్లో గురువారం నుంచి పునశ్చరణ తరగతులు ప్రారంభించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ప్రిన్సిపాళ్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యాపకులు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు కళాశాలలకు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు సరిపడా లేకపోవడం, కొత్తవారిని నియమించకపోవడంతోపాటు రీఅడ్మిషన్లు పొందినవారు తరగతులకు సరిగా హాజరుకాకపోవడంతో పబ్లిక్‌ పరీక్షల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. మొదటి ఏడాదిలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. పబ్లిక్‌ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారికి మే 24 నుంచి జూన్‌ 1వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించేందుకు ఇప్పటికే బోర్డు షెడ్యూల్‌ ఇచ్చింది.


ఉన్నతాధికారి అత్యుత్సాహం

పాఠశాల విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంచి చూపించేందుకు ఉన్నతాధికారి చేసిన ప్రయత్నం ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలవడానికి దారి తీసింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నందున దీన్ని పెంచి చూపించేందుకు గతంలో ఫెయిలయిన వారిని సైతం రెగ్యులర్‌ విద్యార్థుల్లా ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలిచ్చారు. కళాశాలల ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెచ్చి, పరీక్ష ఫీజులు కట్టించారు. కొన్నిచోట్ల విద్యార్థులు ఆసక్తి చూపకపోయినా ప్రిన్సిపాళ్లే పరీక్ష ఫీజులు చెల్లించారు. వీరు తరగతులకు హాజరుకాలేదు. పాఠాలు వినకపోవడంతో ఇలా రీ-అడ్మిషన్లు పొందినవారిలో చాలా మంది ఫెయిలయ్యారు. ప్రభుత్వ కళాశాలల నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు 46,549 మంది హాజరైతే 17,789 (38%) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 36,929 మంది రాస్తే వీరిలో 21,382 (57.9%) మంది ఉత్తీర్ణత సాధించారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.