* మే 26న రెండు షిఫ్టుల్లో పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా మే 26న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాలు/ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య; రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికిపైగా అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే ఐఐటీల్లో బీటెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులు అందుబాటులో వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే ముందు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచనలు...
‣ డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీతో పాటు ఒరిజినల్ ఫొటో తీసుకెళ్లాలి.
‣ ఆధార్ కార్డ్, పాఠశాల/ కళాశాల/ విద్యా సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్పోర్టు, పాన్ కార్డు తదితరాల్లో ఏదో ఒకటి కచ్చితంగా ఉండాలి.
‣ పెన్నులు, పెన్సిళ్లు, పారదర్శకమైన తాగునీటి బాటిల్కు అనుమతి ఉంటుంది.
‣ అభ్యర్థులు పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
‣ దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు.
‣ స్కార్ఫ్లు, మఫ్లర్లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు ఇతరాలు ధరించరాదు.
‣ బూట్లు, మందమున్న చెప్పులు అనుమతించరు.
‣ లోహాలతో కూడిన వస్తువులను ధరించకూడదు.
‣ ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి.
‣ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.
‣ మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.