* మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డే కాదు.. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే గానీ.. సంస్థాగత వైఫల్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
త్వరలో పరీక్షలు.. మళ్లీ ఫీజు చెల్లించక్కర్లేదు..
‘‘టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు చేయాల్సిన మార్పులను చేస్తాం. నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. ఈ పరీక్షలను రాసే విద్యార్థులు ఎవరూ ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారెవరూ ఫీజు చెల్లించనక్కర్లేదు. మార్పులు తీసుకొచ్చి మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి కోచింగ్ మెటీరియల్ అంతా ఆన్లైన్లో పెడతాం. ఉచితంగా మెటీరియల్ ఇచ్చే బాధ్యత మాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. రీడింగ్ రూమ్లను సైతం 24గంటలూ తెరిచే ఉంచాలని నిర్ణయించాం. ఉచిత మెటీరియల్తో పాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తాం. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి సహకరిస్తాం’’ అని కేటీఆర్ వివరించారు.
రాజకీయ నిరుద్యోగుల మాటలు పట్టించుకోవద్దు
ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతోంది. తప్పు జరిగినప్పుడు ఎలా సరిదిద్దాలి? ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. నీళ్లు నిధులు, నియామకాల పునాదులపైనే కేసీఆర్ సారథ్యంలో ఉద్యమం నడించింది. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా 95శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చేలా చట్టసవరణ చేసి రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకున్నాం. తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా ఉద్యమాల్లో పాల్గొంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా టీఎస్పీఎస్సీ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. చిన్న లోపం తలెత్తినా సరిదిద్దుకొనే సంస్కారం మాకు ఉంది. అపోహలు సృష్టించే వారిని విశ్వసించవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
టీఎస్పీఎస్సీ.. దేశంలోనే అత్యుత్తమ సంస్థ!
‘‘దేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా టీఎస్పీఎస్సీ పేర్గాంచింది. ఎన్నో రకాల సంస్కరణలు, మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోంది. అందులోభాగంగానే OTRను తీసుకొచ్చింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ల ద్వారా ఫీజు చెల్లింపు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్లను నిర్వహించే దానికి శ్రీకారం చుట్టింది. సీబీటీ విధానంలో భాగంగా 99 పరీక్షలను నిర్వహించింది. 4.5లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టాం. సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా అనేక పద్ధతులు తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి టీఎస్పీఎస్సీని సందర్శించి ఇక్కడి మార్పులు, చేర్పులను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై అధ్యయనం చేసి వెళ్లారు. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్లు, సభ్యులు ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఏర్పాటయ్యాక దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ. ఏడు భాషల్లో (బెంగాలీ, మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ, తెలుగు) ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సీదే. పక్షపాతధోరణులకు తావు ఉండొద్దనే నిరుద్యోగ యువకులకు ఇంటర్వ్యూ పద్ధతినే రద్దు చేశాం’’ అన్నారు.
రాజశేఖర్ రెడ్డి భాజపా క్రియాశీల కార్యకర్త!
ఈ వ్యవహారంలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అనుమానంతో భారాస తరఫున డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి భాజపా క్రియాశీల కార్యకర్త. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆ పార్టీ పట్ల అనుకూలతను ప్రదర్శిస్తూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కేసులో ఉండటంతో అనుమానించాల్సి వస్తోంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా ప్రభుత్వం నిందలు వేసి అప్రతిష్టపాల్జేసే కుట్ర ఇందులో ఏమైనా ఉందా? అనే కోణంలో శోధించాలని డీజీపీని కోరుతున్నాం. దీని వెనుక ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరీక్ష రాసిన వాళ్లు మళ్లీ రాయాలని బాధపడుతున్నారు. ఎలాంటి అనుమానాలు రావొద్దనే పరీక్షలు రద్దు చేశాం. క్వాలిఫై అయిన వాళ్లు పెద్ద మనుసుతో అర్థం చేసుకోండి. అపోహలు, అనుమానాలు, దుష్ప్రచాలు నమ్మొద్దు. సిట్ విచారణ ఇంకా పూర్తికాలేదు.. అన్ని విషయాలూ బయటకు వస్తాయి’’ అని కేటీఆర్ చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.