12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలు పెట్టేయండి’’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా మటుకు అయిదేళ్లు కూడా చాలా తక్కువ’’ అని వ్యాఖ్యానించారు. న్యాయ వృత్తిలో పరిణతి కలిగిన వారి అవసరం ఉందని, ఇందుకు అయిదేళ్ల కోర్సు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సుదీర్ఘమైన ఈ అయిదేళ్ల కోర్సు వల్ల విద్యార్థులపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఇది మూడేళ్లకు తగ్గితే పేదలకు, ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్లో తెలిపారు. బ్రిటన్లోనూ మూడేళ్ల కోర్సునే అవలంభిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం.. ఈ ఏడాది 70% మంది మహిళలు జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో ప్రవేశించారని, ఎంతో మంది బాలికలు చట్టాన్ని చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎల్ఎల్బీ కోర్సు బాగానే ఉందని దీనిపై పునరాలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అభ్యర్థనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.