* 6-10 తరగతుల వరకు ఒకే నమూనా ప్రశ్నపత్రం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించిన బేస్లైన్ టెస్ట్ను ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంగ్ల భాషపై విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఆరు నుంచి పదో తరగతి వరకు ఒకే నమూనా ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు. ఆరో తరగతి విద్యార్థికి, పదో తరగతి విద్యార్థికి ఒకే రకమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. అధికారులు కనీసం ప్రశ్నాపత్రాన్ని పరిశీలించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిబ్బంది మొక్కుబడి తంతుగా దీన్ని నిర్వహించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ప్రశ్నపత్రం ఇస్తున్నామనే దాన్ని పట్టించుకోలేదు. ఆరో తరగతి విద్యార్థులకు విభక్తి (ప్రిపోజిషన్స్) లేకపోయినా దీనిపై ఆరు ప్రశ్నలు ఇచ్చారు. సిలబస్లో లేని ప్రశ్నలకు విద్యార్థులు ఎలా సమాధానాలు రాస్తారు? 6 - 10 తరగతులకు ఆంగ్ల భాష పరీక్ష నిర్వహణకు 10 ప్రశ్నపత్రాలు ఇచ్చారు. అన్నీ ఒకేలా ఉన్నాయి. ఐదో ప్రశ్నపత్రంలో వ్యతిరేక పదాల్లో పొడవు అనే పదం ఇవ్వాల్సి ఉండగా.. టోల్ అని ఇచ్చారు. కనీసం అక్షర దోషాలను పరిశీలించలేదు. ఇలాంటి ప్రశ్నపత్రంతో విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.