వారం రోజుల్లో శాఖలు వివరాలివ్వాలి
ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీశ్రావు సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. ఆర్థికశాఖ అనుమతించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో సంబంధిత శాఖలు నియామక సంస్థలకు అందజేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు 26న మంత్రి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సహా అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, టీఎస్పీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సహా నియామక సంస్థల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ ఇప్పటికే 50 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినా ఇందులో సగం ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీసు నిబంధనల సవరణలు, కొత్త జోనల్ విధానం పేరిట జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-3, గ్రూప్-4, ఇంజినీర్ల నియామకం, గురుకులాల పోస్టుల భర్తీ అంశంలో ఆలస్యం చేయవద్దన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా వివరాలను వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ అంశంపైనే గంట పాటు చర్చ జరిగింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.