వ్యవసాయ, అనుబంధ రంగాల డిగ్రీ ప్రవేశాలకు నూతన విధానం
తిరుపతి (వ్యవసాయం), న్యూస్టుడే: బైపీసీ స్ట్రీమ్కు సంబంధించి ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ విధానంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర పశువైద్య, డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన, ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించిన నేపథ్యంలో ఆయా వర్సిటీలు విడిగా ప్రవేశ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుకు ఈ నెల 15 ఆఖరు తేదీ. బీఎస్సీ(ఆనర్స్) హార్టీకల్చర్లో ప్రవేశాలు పొందేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఈ నెల 12లోపు దరఖాస్తులు సమర్పించాలి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సైతం బీవీఎస్సీ(యానిమల్ హజ్బెండరీ) కోర్సులో ప్రవేశాలకు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన విడుదల చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని నర్సాపురంలో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం పరిధిలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు కళాశాలలో బీఎఫ్ఎస్సీ(ఫిషరీస్) కోర్సులో ప్రవేశాలకు త్వరలో ప్రకటన విడుదల కానుంది. ఆయా విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్సైట్లు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్సైట్ నుంచి మరింత సమాచారం పొందొచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.