అనుబంధ గుర్తింపు నిలిపివేసిన విశ్వవిద్యాలయాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సుమారు వంద ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది కొత్తగా ప్రవేశాలు బంద్ కానున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేవని విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది అనుబంధ గుర్తింపు నిలిపివేశాయి. దీంతో ఆయా కళాశాలలను కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. విశ్వవిద్యాలయాలు మొదట చేపట్టిన తనిఖీల్లో అన్ని డిగ్రీ కళాశాలలకు అనుమతులు వచ్చాయి. అయితే.. లోపాలు ఉన్నా ఎందుకు అనుమతులు ఇచ్చారంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వర్సిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తనిఖీలు చేయాలని సుమారు 200కళాశాలల జాబితాను విశ్వవిద్యాలయాలకు పంపించారు. పునఃపరిశీలనలో వంద కళాశాలలకు అనుమతులు నిలిపివేసేందుకు వర్సిటీలు నివేదికలు ఇచ్చాయి. సోమవారం వర్సిటీ పాలకవర్గ సమావేశాల్లో ఇందుకు ఆమోదం లభించింది. గుర్తింపు నిలిపివేసిన కళాశాలలను ప్రస్తుతం ఉన్న రెండు, మూడు సంవత్సరాల విద్యార్థుల కోసం కొనసాగిస్తారు. మొదటి ఏడాదిలో ప్రవేశాలు ఉండవు. లోపాలను సరి చేసుకుంటే వచ్చే ఏడాది గుర్తింపునిస్తారు.
వాయిదాలపై వాయిదా..
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ వాయిదా పడుతూనే ఉంది. ప్రవేశాలకు జులై 22న ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేయగా.. ఇంతవరకు కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్లకు మొదట జులై 31 వరకు అవకాశం కల్పించి, ఆ తర్వాత ఆగస్టులో 3సార్లు వాయిదా వేశారు. మరోసారి ఈనెల 10వరకు అవకాశం కల్పించి.. ఇప్పుడు వెబ్ ఐచ్ఛికాలు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. రాష్ట్రంలో అన్ని కళాశాలల్లో కలిపి 2.5లక్షల సీట్లు ఉండగా.. ఇప్పటి వరకు 1.15లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత రెండేళ్లతో పోల్చితే దరఖాస్తుల్లో సగం మంది తగ్గిపోయారు. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం విద్యార్థులను ముందుగానే చేర్చుకొని, వారి తరఫున ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.