83% మంది భారతీయ విద్యార్థుల విశ్వాసమిదే: సర్వే
దిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఉద్యోగాల వేటలో ఉత్తమమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విదేశీ డిగ్రీలు బాగా ఉపయోగపడతాయని, పోటీలో అగ్రభాగాన నిలబడేలా చేస్తాయని అత్యధిక మంది విశ్వసించడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 83 శాతం మంది భారతీయ విద్యార్థులు ఈ అభిప్రాయంతోనే ఉన్నారని లీప్ సంస్థ అధ్యయనం వెల్లడించింది. వార్షికాదాయం రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కలిగిన మధ్య తరగతి కుటుంబాల్లో 57శాతం మంది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికే మొగ్గుచూపుతున్నారని ‘ది లీప్-ఐప్సోస్ స్ట్రాటెజీ స్టడీ అబ్రాడ్ అవుట్లుక్’ నివేదిక పేర్కొంది. మధ్యతరగతి కుటుంబాల్లో విదేశీ విద్య పట్ల ఆకర్షణ ఏ స్థాయిలో ఉందో విశ్లేషించింది. ‘2025 నాటికి 20 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ విదేశీ చదువుల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి పరాయి దేశాలకు వెళ్తారు. అంతర్జాతీయ స్థాయి విద్య కోసం రూ.8 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు పైగా ఖర్చు చేస్తారు. విదేశీ విద్య మార్కెట్ అనేక రెట్లు వృద్ధి చెందనుంద’ని లీప్ సహ వ్యవస్థాపకుడు వైభవ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ అనుసంధానత పెరగడం వల్ల ఇంగ్లీషేతర భాషల దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు 42 శాతం మేర ఉంటారని అంచనా వేశారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లు, ఉపకారవేతనాలు, జీవన వ్యయం తదితర అంశాలు విద్యార్థుల ప్రాధాన్యతలను ప్రభావితం చేయనున్నాయి. దీని కోసం విద్యా రుణాలపై అత్యధికంగా ఆధారపడుతున్నారని విశ్లేషించారు. విదేశీ విద్యకు వెళ్తున్న వారిలో మూడింట రెండు వంతుల మంది 18 నుంచి 24 ఏళ్ల లోపు వారే. 25 నుంచి 30 ఏళ్ల లోపు వారు 34 శాతం మంది ఉంటున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. విదేశీ విద్యకు వెళ్తున్న వారిలో 60 శాతం మంది పురుషులు కాగా 39 శాతం మంది మహిళలు. మిగిలిన ఒక్క శాతం మంది తమ జెండర్ వెల్లడించడానికి ఇష్టపడలేదు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!
‣ ఉజ్జ్వల భారత్ సాకారమే లక్ష్యంగా...
‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు
‣ అందరికీ అందని బ్యాంకింగ్ సేవలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.