ఈనాడు డిజిటల్, పాడేరు: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పూర్తయింది. కొన్ని సబ్జెక్టుల్లో ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోగా.. మరికొన్నింటిల్లో భారీగా కొరత ఉంది. వీటి మధ్య అంతరం తగ్గించేందుకు సర్కారు సబ్జెక్ట్ కన్వర్షన్ను తీసుకువచ్చింది. అంటే ఇప్పటి వరకు లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఇకపై తెలుగు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 226 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం తాము బోధిస్తున్న దానినుంచి మరో సబ్జెక్ట్ బోధించేందుకు మారిపోతున్నారు. ఆ మేరకు పాత పోస్టులు రద్దయిపోయినట్లేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. కన్వర్షన్ వల్ల అర్హులైన ఎస్జీటీలు పదోన్నతులు కోల్పోవల్సి వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.
‣ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 229 ఆంగ్లం టీచర్ పోస్టుల కొరత ఉంది. ఆ తర్వాత, హిందీ 111, తెలుగు 110, భౌతికశాస్త్రం 61, జీవశాస్త్రం 44, గణితం 43 పోస్టులు ఖాళీలున్నాయి. వాటిలో ఇతర సబ్జెక్ట్ల్లో అదనంగా ఉన్న గురువులను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మాస్టారు ఏ పాఠం చెబుతున్నా మరో పాఠ్యాంశం చెప్పడానికి అర్హత ఉంటే చాలు వారిని కన్వర్షన్ చేయబోతున్నారు.
బోధనపై పట్టు సాధించేనా..
ఎక్కువగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు మిగలడం, వారు సబ్జెక్ట్ టీచర్గా మారడానికి అర్హత ఉండడంతో వారినే ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే సాంఘికశాస్త్రం బోధించేవారు కూడా సైన్స్, ఆంగ్లం బోధించడానికి ముందుకొస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే సబ్జెక్ట్పై పట్టున్న ఉపాధ్యాయులు బోధిస్తేనే పదోతరగతి ఫలితాలు అంతంతమాత్రంగా వచ్చాయి. ఉన్నట్టుండి సబ్జెక్ట్ మార్చి చెప్పాలంటే కొంత కష్టమేనని ఉపాధ్యాయులే చెబుతున్నారు. కుదురుకునే వరకు బోధనపై కొంత ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.