డీఈఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ముగిసి నెలపైనే..
అనుబంధ గుర్తింపు తనిఖీలపై ఎస్సీఈఆర్టీ మీనమేషాలు
వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: కరోనా సద్దుమణిగింది.. ఈసారైనా డీఈడీ విద్యాసంవత్సరం సకాలంలో ప్రారంభమవుతుందని భావించిన కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినందున వెబ్ ఆప్షన్లు ఎప్పుడు మొదలవుతాయోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్ ఆలస్యమైతే డీఎడ్లో చేరే ఆ కొద్దిమంది కూడా మిగలరని కళాశాలల యాజమాన్యాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. డీఈడీ కోర్సులో ప్రవేశానికి జులై 23న నిర్వహించిన డీఈఈసెట్కు 8,645 మంది హాజరయ్యారు. ఫలితాలను ఆగస్టు 10న వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 22న మొదలై 25తో ముగిసింది. నెల గడిచినా విద్యార్థులు ఆయా కళాశాలలను ఎంచుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకాలేదు.
ఆరు నెలల క్రితం అప్పగించినా...
కరోనా కారణంగా గత రెండు విద్యాసంవత్సరాలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులే డీఈడీ కళాశాలలను తనిఖీ చేయకుండా అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) ఇచ్చారు. గత ఏడాది 92 కళాశాలలు కౌన్సెలింగ్కు అనుమతి పొందాయి. ఆయా కళాశాలలను తనిఖీ చేసి అనుబంధ గుర్తింపు ఇచ్చే బాధ్యత రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)దే. అందుకే గత ఏప్రిల్లో ఆ వ్యవహారాన్ని చూడాలని డైరెక్టరేట్ అధికారులు ఎస్సీఈఆర్టీకి బాధ్యత అప్పగించారు. ఆ విభాగం అధికారులు పట్టనట్లు వ్యవహరించారు. కనీసం డీఈఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన మొదలయ్యాక కూడా ప్రక్రియ ప్రారంభించలేదు. పరిశీలన పూర్తయి నెల దాటినా నాన్చుతూనే ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కింది అధికారులు నిర్ణయం తీసుకోలేని పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్సీఈఆర్టీ సంచాలకురాలు రాధారెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి ఇంకా తనిఖీలు చేయాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై అక్టోబరు మొదటివారంలో స్పష్టత వస్తుందన్నారు. విద్యార్థులు మాత్రం త్వరగా తరగతులు మొదలైతే డీఈడీ పూర్తయ్యాక డిగ్రీలో చేరడానికి వీలవుతుందని, లేకుంటే ఏడాది వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.